సనత్నగర్ ( హైదరాబాద్) : సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యారని సనత్ నగర్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani ) విమర్శించారు. శుక్రవారం అమీర్ పేట డివిజన్ శ్రీరాం నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సనత్ నగర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించానని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సహకారంతో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రం అత్యధిక ఆదాయం పొందుతుందని, అయినా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతుందని ఆరోపించారు.
కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, కాలనీ ప్రతినిధులు కుమార్, చెన్నయ్య, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.