హైదరాబాద్ : ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు. రాష్ట్రానికి ఒక వేషం, ప్రధాని మోదీ తీరొక్క డ్రెస్సు లతో షో చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు.
ప్రశ్నించిన వారిని కేంద్ర సంస్థలను అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తే ఎవరు భయపడరన్నారు. అధికారం ప్రజలు ఇచ్చిన అవకాశం. మీ ప్రభుత్వాన్ని రద్దు చేసే దమ్ముందా.. మేము సిద్ధంగా ఉన్నామని బీజేపీకి సవాల్ విసిరారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల లాగా అమలు అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు అవుతున్నాయా ? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ను కుటుంబాన్ని కుటుంబ పాలన అని పేర్కొనడం అవివేకం అన్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాలలో కేసీఆర్ కుటుంబం పాల్గొన్నది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్న బీజేపీ నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత అధినాయకత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఎంతో సురక్షితంగా ఉన్నందున భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ప్రధానికి ముఖ్యమంత్రులు ఎందుకు స్వాగతం పలికేందుకు రావడం లేదో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. నూతనంగా 80 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్న చరిత్ర మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు.