అబిడ్స్, డిసెంబర్ 29: వ్యాపారాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని, నాలాను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను గుర్తించడం జరుగుతోందని, నోటీసులు ఇచ్చి నిర్మాణాలను తొలగిస్తామని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల కుంగి కూలిపోయిన ‘చాక్నావాడి’ నాలాను ఆయన గురువారం అధికారులతో కలిసి పరిశీలించి చేపట్టనున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నాలా పునరుద్ధరణ పనులు చేపట్టేందుకుగాను రూ.కోటి 27 లక్షల నిధులను విడుదల చేశామని, మూడు రోజుల్లో నాలా పునరుర్ధరణ పనులు ప్రారంభమై నెల రోజుల్లో పూర్తయ్యేలా చూస్తున్నామన్నారు. భారీ లోడ్ వాహనా లు తిరగడం వలనే నాలా కుంగి పోయిందని, నాలా పునరుద్ధరణ పనులు పూర్తయిన తరువాత భారీ లోడ్ వాహనాలు తిరగకుండా కమాన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. భవన నిర్మాణదారులపై ఫిర్యాదులు చేసి అక్ర మ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. అలాంటి వారు ఇచ్చే ఫిర్యాదులను అధికారులు ప్రోత్సహించవద్దని సూచించారు.
ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదన్నారు. బ్లాక్ మెయిలింగ్కు పాల్పడే వారిలో అధికారులు సన్నిహితంగా మెలిగితే అధికారులపై కూడా చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఎస్ఈ సహదేవ్ రత్నాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాస్, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు జి శంకర్ యాదవ్, లాల్సింగ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్వి మహేందర్కుమార్, ఎం ఆనంద్కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు ముఖేశ్సింగ్, రాంచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.