హైదరాబాద్ : నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ కమాన్ వద్ద ఫలహారం బండిని మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కమాన్ వద్ద నుంచి సిటీ లైట్, బాటా మీదుగా మహంకాళి దేవాలయం వరకు చేరుకున్నది.
ఫలహారం బండి ఊరేగింపు ముందు పోతురాజులు, వివిధ వేషధారణలు, కళాకారుల ప్రదర్శనలు, నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పూణే కళాకారుల ధోల్ తాషా పాఠక్ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్, శ్రీనివాస్ గౌడ్ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.