ఖైరతాబాద్, మే 5 : ‘ఈ సారి బుద్ధ జయంతికి ఓ ప్రత్యేకత ఉన్నది.. ఓ వైపు సాక్షాత్తు 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, మరోవైపు అంబేద్కర్ సచివాలయం.. ఈ ప్రాంతంలో బౌద్ధ జయంతిని ప్రారంభించుకోవడం అద్భుత ఘట్టం’ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 2567వ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ ప్రాంగణంలో ‘బౌద్ధ పీస్ కార్’ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీని ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు జి. పరందాములుతో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు పంచశీల జెండాను ఆవిష్కరించారు.
మంత్రి మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి ఏడాది ఇదే వేదికగా బుద్ధ జయంతోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. బుద్ధుడు, మహాత్మాజ్యోతిబా పూలేలను ఆదర్శంగా తీసుకొని జాతికి మేలు జరగాలని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుండాలని, అది రిజర్వేషన్ల ద్వారానే సాధ్యమవుతుందని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ సతీశ్, జి.రాజేశ్వర్రావు, అశోక్ భాగ్యవన్, సుదర్శన్, సలహాదారులు చింతా శ్రీరామమూర్తి, కేకే రాజా, రావుల అంజయ్య పాల్గొన్నారు.
గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా బోటులో బుద్ధుడి విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి ప్రార్థన చేశారు. మంత్రి వెంట పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్సుల్తానియా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి ఎండీ మనోహర్, టూరిజం అధికారులు శశీధర్, మనోహర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంలో బోటులో ప్రయాణించి బుద్ధుడి విగ్రహం వద్దకు చేరుకున్నారు.