మెహిదీపట్నం, జూలై 14: చారిత్రాత్మక గోల్కొండ కోటలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లైట్ అండ్ సౌండ్ షో ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, పర్యాటక శాఖ ఎండీ మనోహర్లతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ‘లైట్ అండ్ సౌండ్ షో’కు ఆదరణ పెరిగేలా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ర్టానికి తలమానికమైన గోల్కొండ కోటకు వచ్చే పర్యాటకులకు కనీస సౌకర్యాలను కల్పించాలని సూచించారు.
గోల్కొండ విశేషాలను ఈ సందర్భంగా గైడ్లు మంత్రికి వివరించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఉద్యోగులు నిర్వహించిన బోనాలలో పాల్గొన్న మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అనంతరం, వారితో కలిసి సహపంక్తి భోజనాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, టూరిజం ఎండీ మనోహర్, ఉన్నతాధికారులు సత్యనారాయణ, ఓం ప్రకాష్, కోట పర్యవేక్షక అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.