ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజాపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ప్రజాపాలన అమలుపై మంగళవారం బంజారాభవన్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలతో కలిసి మంత్రులు పొన్నం, దుద్దిళ్ల శ్రీధర్బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో 4800మంది సిబ్బందితో కలిసి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఒక్కో వార్డులో నాలుగు కౌంటర్లు 600 లొకేషన్లలో ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం స్వయం సహాయక బృందాలతో కలిసి దరఖాస్తు నమూనా పత్రాలను అందిస్తామని తెలిపారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగానే ప్రజాపాలనను చేపట్టి, దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, దరఖాస్తుల ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత ప్రత్యేక గైడ్లైన్స్ను ప్రకటించి అభయహస్తం అమలు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పారు. ఆరు గార్యంటీలను అమలు చేయడం మా ప్రధాన ధ్యేయమని, ఇచ్చిన వాగ్దానాలను ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మంత్రులు స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, ఇందిరమ్మ ఇల్లు కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రులు చెప్పారు. కార్యక్రమంలో అధికారుల భాగస్వామ్యం, ప్రజల సహకారం అవసరమని తెలిపారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ): ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజాపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. అభయ హస్తం కింద ఆరు గార్యంటీలను అమలు చేయడం మా ప్రధాన ధ్యేయమని, ఇచ్చిన వాగ్దానాలను ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, 48 గంటలు తిరుగకముందే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10లకు పెంచామన్నారు. ప్రజాపాలన అమలుపై మంగళవారం బంజారాభవన్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలతో కలిసి మంత్రులు పొన్నం, దుద్దిళ్ల శ్రీధర్బాబులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా పాలనలో ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చుస్తామని మంత్రులు తెలిపారు.
ప్రజలు స్వేచ్ఛగా వచ్చి వారీ వారీ సమస్యలను తెలియజేయాలన్నారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగానే ప్రజాపాలనను చేపట్టి, దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉందన్నారు. ప్రజాపాలన వేదిక ద్వారా వచ్చిన దరఖాస్తుల సమాచారాన్ని క్రోడీకరించి తర్వాత ప్రత్యేక గైడ్లైన్స్ (విధి విధానాల)ను ప్రకటించి అభయహస్తం అమలు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పారు. ఆశావహుల డేటా సేకరణ కోసమే దరఖాస్తుల స్వీకరణ అని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇల్లు కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రులు చెప్పారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, గతంలో అనర్హులకు డబుల్బెడ్ర్రూం ఇండ్లు వచ్చాయనే ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రులు చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో 4800 మంది సిబ్బందితో కలిసి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. ఒక్కో వార్డులో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి విషయ (డాటా) సేకరణ జరుపుతామని తెలిపారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడతామని తెలిపారు. ఒక్కో టీంలో టీం లీడర్తో పాటు ఏడుగురు, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దరఖాస్తు దారులకు సహకారం అందించేందుకు పది మంది వలంటీర్లను అందుబాటులో పెడతామన్నారు. మంగళవారం స్వయం సహాయక బృందాలతో కలిసి దరఖాస్తు నమూనా పత్రాలను అందిస్తామని తెలిపారు. ప్రతి వార్డులో సమయ పాలనపై ముందస్తుగా సమాచారం అందిస్తామని, ఆఖరి దరఖాస్తుదారుడికి కూడా అవకాశం ఇస్తామన్నారు.
బుధవారం గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి, వారి సలహాలు, సూచనలను అనుగుణంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అన్నారు. మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు.అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆలోచనకు అనుగుణంగా వచ్చిన ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని చెప్పారు. దరఖాస్తులు సమర్పించిన వారందరికీ రిసిఫ్ట్లు అందజేస్తామన్నారు. ఉచిత ఫ్రీ బస్సు సౌకర్యం కింద 4 కోట్ల మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజలకు న్యాయం జరగాలన్నదే మా ధ్యేయమని చెప్పారు. డేటా కలెక్షన్ తర్వాతనే గైడ్లైన్స్ ప్రేమ్ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ పథకాలు అమలు కావాలంటే అధికారుల భాగస్వామ్యం, ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ప్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ప్రజల నుంచి అందే ప్రతి దరఖాస్తును తీసుకోవాలని, ఈ పథకానికి వంద శాతం సహకరించడం జరుగుతుందన్నారు. గతంలో జీహెచ్ఎంసీ అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడంలో ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారని మేయర్ తెలిపారు. ప్రజలకు లబ్ధి పొందే ఆరు గ్యారంటీ పథకాలు మంచి కార్యక్రమం అయినందున వీటి అమలును పారదర్శకంగా చేయాలని కోరారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
600 లోకేషన్లలో దరఖాస్తుల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ రొనాల్డ్ రాస్ చెప్పారు. ప్రతి కౌంటర్ వద్ద మహిళకు, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీలు కాకుండా ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి దరఖాస్తును స్వీకరించి రశీదు అందజేస్తామని చెప్పారు.
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణలో అంతా గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఏ పథకమైనా అమలు చేసే ముందు స్పష్టమైన విధి విధానాలు ప్రకటించాలి. ఫలానా పథకానికి వీరు అర్హులని స్పష్టంగా తెలియజేయాలి. కానీ ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు పేరిట రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రజాపాలనలో ఆరు గ్యారంటీలకు ఎవరు అర్హులు, విధి విధానాలు ప్రకటించి మాత్రమే అర్హులైన ప్రజలను దరఖాస్తు చేసుకోవాలని చెప్పాలి. కానీ అందరూ దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రజల సమయం దుర్వినియోగం చేసే పని చేస్తుందే తప్ప ప్రజాపాలనపై స్పష్టత కొరవడింది.
రేషన్ కార్డు దారుడే పథకానికి ప్రామాణికమని ఒక మంత్రి, డేటా సేకరణ కోసమే ప్రజాపాలన నిర్వహిస్తున్నామని, గైడ్లైన్స్ తర్వాత ఇస్తామని మరో మంత్రి చెబుతూ ప్రజాపాలన పేరిట ప్రజల్లో గందరగోళానికి తెరలేపారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెబుతూనే ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారు సైతం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అయితే వీరు కొత్త రేషన్కార్డు ఇచ్చేదెప్పుడు, ఆరు గ్యారంటీలకు అర్హులని గుర్తించేది ఎప్పుడో చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే ఉన్న పింఛన్దారులు మళ్లీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవద్దని మంత్రులు పొన్నం, దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పడం, వీరు ఆరు గ్యారంటీలకు అర్హులు కాదా? అన్న అనుమానాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక జిల్లాలో 6.35 లక్షల రేషన్కార్డుదారులు ఉంటే కొత్తగా మరో లక్ష మంది వరకు ఉన్నారు. రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏమిటన్నదానిపై మంత్రులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దరఖాస్తు దారుల డేటా స్వీకరణతోనే సరిపుచ్చుతారా? ఆరు గ్యారంటీ పథకాల అమలులో మళ్లీ గైడ్లైన్స్లను ప్రకటించి మరోసారి దరఖాస్తుల స్వీకరణ చేస్తారా? అసలు అభయహస్తంలో అర్హులు ఎవరూ? అనర్హులు ఎవరూ? ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఉన్నప్పటికీ మళ్లీ కొత్తగా దరఖాస్తు స్వీకరణ ఎందుకు? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాపాలన పేరిట ప్రజల సమయం వృథా చేయవద్దని, అర్హులను సకాలంలో గుర్తించి పథకాలను అమలు చేయాలన్న డిమాండ్ ప్రజలనుంచి వ్యక్తమవుతున్నది.