వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 21 : ఆదివాసుల్లో ఆంజనేయ శక్తి దాగిఉన్నదని, వారికి చదువుతో పాటు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని మహిళా, శిశు సంక్షేమ శాఖల రాష్ట్ర మంత్రి డి.సీతక్క అన్నారు. గురువారం రాజేంద్రనగర్లోని కో ఆఫరేటివ్ ట్రైనింగ్ సమావేశపు మందిరంలో 15వ గిరిజన, యువజన ఎక్సేంజ్ ప్రోగ్రామ్ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసి బిడ్డలు ఇప్పుడిప్పుడే మారుతున్న సమాజం వైపు చూస్తున్నారని గుర్తు చేశారు. వారిలో చదువుతో పాటు బిడియం, సిగ్గు తప్పా.. ఎంత తవ్వితే అంత పరిజ్ఞానం ఉంటుందన్నారు. ఆదివాసి బిడ్డలు వారికి నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని , మనం మారుతూ మన సమాజ మార్పునకు కృషిచేయాలని సూచించారు. దేశంలోని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర , జార్ఖండ్, బిహార్ తదితర రాష్ర్టాల నుంచి దాదాపు 279 మంది ఆదివాసి బిడ్డలు ఈ శిక్షణకు రావడం అభినందనీయమన్నారు.
కేంద్ర హోం వ్యవహారాల శాఖ, యువ కేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణకు ఆయా రాష్ర్టాల మారుమూల ఆదివాసి యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ రాష్ట్ర డైరెక్టర్ ఏఆర్ విజయా రావు, సహాకార సంఘం ట్రైనింగ్ సంస్థ డైరెక్టర్ ఎం.ఆర్.శ్రీనివాస రావు , మేనేజ్మెంట్ డైరెక్టర్ ఆర్.ఘనేషన్, జిల్లా యూత్ ఆఫీసర్ ఖుష్బూగుప్తా, ఐసీఎం డా.శ్రీనివాస్ తదితరులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు . వివిధ చట్టాలతో పాటు పలుసంస్కృతిక కార్యక్రమాలు ఈ నెల 27 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.