బడంగ్పేట్, జూన్ 8 : మిషన్ కాకతీయతో చెరువులు నిండుకుండలా మారాయి. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా మీర్పేట్ చందనం చెరువు వద్ద చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పోతరాజుల విన్యాసాలు.. పటాకుల పేలుళ్లు.. ఒగ్గు కళాకారుల ఆటపాటలతో చందనం చెరువు పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. చందనం చెరువు ట్యాంక్ బండ్పై, బడంగ్పేట్లోని పోచమ్మ కుంట, తుక్కుగూడ చెరువు వద్ద పండుగ వాతావరణంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాకముందు చెరువులల్లో గుర్రపు డెక్క, పరిగి కంపతో నిండిపోయి ఉండేదన్నారు. నీళ్లు లేక ప్రజలు హరిగోస పడేవారని ఆమె తెలిపారు. నగరం చుట్టూ ఉన్న చెరువులన్నీ మురికి కూపాలుగా ఉండేవన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ ఒక విజన్తో పనిచేస్తూ రాష్ట్రంలో ఉన్న 27వేల చెరువులను అభివృద్ధి చేశారన్నారు. నేడు వేసవి కాలంలో సైతం చెరువులు జలకళను సంతరించుకున్నాయన్నారు. సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించి సుందరీకరణ పనులు చేసి చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీపావళి చౌహన్, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, ఆర్డీవో సూరజ్ కుమార్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తహసీల్దార్ జనార్ధన్రావు, కమిషనర్లు నాగేశ్, కృష్ణమోహన్రెడ్డి, వెంకట్రావు, గోపినాథ్, ఎంఈవో కృష్ణయ్య, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కామేశ్రెడ్డి, రామిడి రాంరెడ్డి పాల్గొన్నారు.