సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : నేటి తరం పిల్లల ఆలోచన విధానానికి కాస్నివాల్ ప్రతీక అని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మవిశ్వాసాన్ని ఇలాంటి ప్రత్యేక ఈవెంట్లు విద్యార్థులకు ఇస్తాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఓక్రిడ్జ్ స్కూల్లో నిర్వహించిన కాస్నివాల్కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ప్రైవేటు పాఠశాలల మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పలు రకాల ఇన్నోవేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ మనవడిగా సమాజానికి ఉపయోగపడే మంచి ఆలోచనలతో హిమాన్షు తన మిత్ర బృందంతో కలిసి పని చేయడం సంతోషకరమన్నారు. ఈ తరం పిల్లలు చదువుతో పాటు సామాజిక చైతన్యంతో మెరుగైన సమాజానికి బాటలు వేస్తున్నారని మంత్రి ప్రశంసించారు.
హిమాన్షు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాస్నివాల్ ద్వారా సేకరించిన డబ్బులను నానక్రాంగూడ చెరువు సుందరీకరణ కోసం కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాగా, ఓక్రిడ్జ్ స్కూల్ కాస్నివాల్లో మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక, సామాజిక దృక్పథంతో నిర్వహించిన కాస్నివాల్కు ఇన్చార్జిగా హిమాన్షు వ్యవహరించాడు. ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసిన 30కిపైగా స్టాళ్లతో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన కాస్నివాల్ ఈవెంట్లో ఓక్జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాళ్లు, లైవ్ మ్యూజిక్ కాన్సెప్ట్తో తమలోని ప్రతిభను విద్యార్థులు వెలికితీశారు.
ఓక్రిడ్జ్ స్కూల్ క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ (CAS) ప్రెసిడెంట్గా ఈ కాస్నివాల్ను నిర్వహించిన హిమాన్షు మాట్లాడుతూ.. తమ కాస్నివాల్ ఈవెంట్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి లాంటిదన్నారు. విద్యార్థులకు చదువు ఒక్కటే ప్రాధాన్యం కాదని, చదువుతో పాటు సామాజిక సేవ చేయడం కోసం కూడా అలవాటు చేసుకోవాలన్నారు. కాస్నివాల్ ద్వారా సమకూరే డబ్బులను నానక్రామ్గూడ చెరువు అభివృద్ధికి కేటాయిస్తామన్నారు. ఈ నా ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందన్నారు. కాస్నివాల్లో సినీ హిరోలు నిఖిల్, కిరణ్ అబ్బవరం పాల్గొని సందడి చేశారు.