బడంగ్పేట, ఫిబ్రవరి 20: తెలంగాణ అమర వీరుడు సిరిపురం యాదయ్య త్యాగం మరువలేనిదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిరిపురం యాదయ్య వర్ధంతి సందర్భంగా మహేశ్వరం గేటు దగ్గర ఆయన విగ్రహాన్ని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన గొప్ప త్యాగధనుడు సిరిపురం యాదయ్య అని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. ఉద్యమ ఆకాంక్ష మేరకు నీళ్లు, నిధులు, నియామకాలు జరిగే విధంగా పాలనను అందిస్తున్నారని ఆమె తెలిపారు. అమరవీరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, సహకార బ్యాంకు చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, కందుకూరు, మహేశ్వరం మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంగోతు రాజునాయక్, మన్నె జయేందర్ తదితరులు పాల్గొన్నారు.