బడంగ్పేట/కందుకూరు/మహేశ్వరం, జూలై 26 : విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాచుపల్లి గ్రామానికి చెందిన మల్లగాళ్ల మహేందర్ ఇటీవల ఢిల్లీలో జరిగిన క్రాస్ బౌ క్రీడల్లో కాంస్య పథకాన్ని సాధించారు. నగరానికి వచ్చిన మహేందర్ జైత్వారం ఎంపీటీసీ గుండాల సురేశ్ ఆధ్వర్యంలో బుధవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మహేందర్ను సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి రాణించడం పట్ల అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వం పోత్సహిస్తుందని చెప్పారు. క్రాస్ బౌ షూటింగ్ అసొసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీ చైతన్య, ప్రధాన కార్యదర్శి వసంత మాధురి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేశ్, నర్సింహ, రాజు, గిరి, విద్యార్థులు పాల్గొన్నారు.
గిరిజన తండాలకు తెలంగాణలో స్వయం పాలన అందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం నాగులదోని సర్పంచ్ మెగావత్ రాజునాయక్ ఆధ్వర్యంలో దయ్యాల గుండు తండా, నాగులదోని తండా అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్దికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి తండా ప్రజలకు స్వయం పాలనను అందిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తండాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమావత్ ఊర్మిళారవినాయక్, వార్డు సభ్యులు గోపాల్ నాయక్, తేజ నాయక్, రాందాస్నాయక్, గోవింద్ నాయక్, దేవుసింగ్ నాయకులు హరిసింగ్, శంకర్, మోహన్నాయక్, లక్ష్మణ్, హర్యానాయక్, రాములు నాయక్, రవినాయక్, దీప్లా, బోడియా తదితరులు పాల్గొన్నారు.
రజక ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి కృషి చేయాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు నుంతల శ్రీనివాస్, సంఘం సభ్యులు కోరారు. బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో రజక ఆత్మగౌరవ భవనం నిర్మాణం చేయించాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.