కందుకూరు, అక్టోబర్ 27 : ఈ ఎన్నికల్లో ప్రతి పక్షాలను బొంద పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామ నర్సింహా రెడ్డి ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు హైదరాబాద్, శ్రీశైలం రహదారిపై పటాకులు కాలుస్తూ మంత్రికి స్వాగతం పలికి, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ర్టానికి బీజేపీ చేసిందేమీలేదన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు కండ్లు మండుతున్నాయన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని, దీనికంతటికి కారణం సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపొవద్దని కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కరెంట్, తాగునీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మనం కాంగ్రెస్కు ఓటేస్తే ఆగం కావాల్సి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్పై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉందని తెలిపారు. వందేండ్ల ప్రగతిని సీఎం కేసీఆర్ 10ఏండ్లలో చేసి చూపించారని వివరించారు.