బడంగ్పేట, నవంబర్ 28: రైతు బంద్ నిలిపివేయాలని రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ దాసిరి నారాయణ రావు కాలనీ, కమలానెహ్రు కాలనీలో సోమవారం రాత్రి మంత్రి రోడ్ షో, సభ నిర్వహించారు. ఉగ్గు డోలు దరువులు, బోనాలు, కోలాటంతో మంత్రికి గులాబీ పువ్వులు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.
మంత్రికి హరతులు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు బందును అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి గుణ పాఠం చెప్పాలని ఆమె ప్రజలకు పిలుపు నిచ్చారు. 2.5 కోట్ల రైతు కుంటుంబాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటం ఆడుతుందన్నారు. తాత్కాలికంగా రైతు బందును అడ్డుకోగల్గిన కాంగ్రెస్ డిసెంబర్ 3తర్వాత ఏ శక్తి కూడ ఆపలేదన్నారు. వ్యవసాయాన్ని నిలబెట్టాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రైతు రైతు బందు తీసుకొచ్చారన్నారు. కోటీ యాబై లక్షల ఎకరాలకు 11 విడతలుగా అమలు చేస్తున్నామన్నారు.
తెలంగాణలో వ్యవసాయం స్థిరపడి బలపడ్డదన్నారు. ఎన్నికల కోసం రైతులు వ్యవసాయం ఆపలేరన్నారు. మూడు గంటలు కరంటు చాలు అంటున్న కాంగ్రెస్కు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ప్రజల సంక్షేమం పట్టని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు అడిగే హక్కులేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు బంధు చేస్తారన్నారు. అభివృద్ధి ఆగిపోతదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16 వేల రైతు బంధు ఇస్తామన్నారు. రూ.400లకే గ్యాస్ ఇస్తామన్నారు.
వికలాంగులకు ఆరు వేల ఫించన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వాని బలపర్చి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓట్లు వేయాలన్నారు. చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తానన్నారు. మహేశ్వరంలో వేల కోట్లతో అభివృద్ధి చేశాను కనుకనే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల బీరప్ప, నవీన్ గౌడ్, అనిల్ కుమార్, ధనలక్ష్మి రాజ్ కుమార్, సిద్దాల లావణ్య బీరప్ప, ధరం కార్ జ్యోతి కిషోర్, సిద్దాల పద్మ అంజయ్య, ముద్ద పవన్ కుమార్, పల్లె జంగయ్య గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, రవి నాయక్, విజయ లక్ష్మి, పల్లె పాండు గౌడ్ పాల్గొన్నారు.
మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా ఎన్నికల చివరి రోజు ఎక్కడికి అక్కడ బైక్ ర్యాలీలు నిర్వహించారు. మహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డిని గెలపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలు చేశారు.