బడంగ్పేట, మార్చి 26 : తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బడంగ్పేట అంతా గులాబీమయంగా మారింది.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారందరికీ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం రాష్ర్టానికి శ్రీరామరక్ష అన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ప్రజల అండదండలు ఉన్నంత కాలం సీఎంను ఎవరూఏం చేయలేరన్నారు.
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్నగర్లో 9 డివిజన్లకు సంబంధించిన ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ.. స్విస్ బ్యాంక్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తామని చెప్పి ఇంత వరకు ఎందుకు వేయలేదో ప్రధాని చెప్పాలని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా..
గతంలో నీటి కోసం యుద్ధాలు చేసిన సందర్భాలు కోకొల్లలుగా చూశామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. బిందెలతో రోడ్లపై క్యూలు కట్టిన రోజులు చూశామని, మహిళల నీటి కష్టాలు చూసిన సీఎం కేసీఆర్ ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ప్రతి ఇంటికి తాగునీళ్లు అందిస్తున్నది వాస్తవం కాదా అని ఆమె పేర్కొన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా నీటి సమస్యను పరిష్కరించామన్నారు. నగరంలో ఎలా అయితే నీళ్లు ఇస్తున్నామో.. గ్రామీణ ప్రాంతాల్లోనూ మిషన్ భగీరత నీళ్లు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఇంటికి మంచినీళ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు బేర బాలకిషన్, అరవింద్ శర్మ, లక్ష్మినర్సింహ, కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్, లిక్కి మమత కృష్ణారెడ్డి, బీమిడి స్వప్న జంగారెడ్డి, పెద్ద బావి శోభా ఆనంద్ రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు గుర్రం ప్రసన్న వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.
బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు..
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను బస్తీలు, గ్రామాల్లో ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నది. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని పటిష్టం చేయాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ప్రజల కోసం పనిచేస్తున్న మంత్రిపై ప్రజల ఆశీర్వాదం ఉండాలి.
– ఆయాచితం శ్రీధర్, గ్రంథాలయ చైర్మన్
మూడోసారి సీఎంగా కేసీఆరే..
తెలంగాణ రాష్ర్టానికి మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి. ప్రభుత్వ దవాఖాలను బలోపేతం చేసి ప్రసవాలన్ని అక్కడే జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. కేసీఆర్ కిట్టుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణే ఒక్కటే.
– తీగల అనితాహరినాథ్రెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్
మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 44వ డివిజన్ శివాజీనగర్కు చెందిన 70 మంది ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జ్యోతి కిశోర్, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కామేశ్ రెడ్డి, ప్లోర్ లీడర్ భూపాల్రెడ్డి, దీప్లాల్ చౌహాన్ పాల్గొన్నారు.