బడంగ్పేట, డిసెంబర్ 4 : మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో చెరువులకు జలకళ సంతరించుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడ 10వ డివిజన్లో రూ.2.40 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు చేశారు. బడంగ్పేట దావూద్ఖాన్గూడలో ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ నూతన భవనానికి భూమి పూజ చేశారు. నైన్హిల్స్ కాలనీలో కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు.
జేఎన్ఎన్యూఆర్ఎంలో క్రైస్తవుల నూతన మత ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల్లో పూడిక తీయడంతో జలకళ సంతరించుకున్నదని తెలిపారు. మీర్పేటలోని మంత్రాల చెరువు, పెద్ద చెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నాయని, అల్మాస్గూడలోని పోచమ్మ కుంట, కోమటి కుంట సుందరీకరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. కుర్మల్గూడ చెరువుల సందరీకరణ పనులకు శంపస్థాపన చేశామని గుర్తు చేశారు. ఆర్సీఐ నుంచి తుర్కయంజాల్ వరకు రూ.140 కోట్లతో 100 ఫీట్ల రోడ్డు పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి కావస్తున్నదని తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ప్రభుత్వ స్కూల్కు భూమి పూజ
బాలాపూర్ మండలంలో నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలను నిర్మిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దావూద్ఖాన్గూడలో రూ.3 కోట్లతో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. సీఎస్ఆర్ ద్వారా మెగా సంస్థ రూ.12 కోట్లతో పాఠశాలల భవనాలను నిర్మించేందుకు ముందుకు రావటం అభినందనీయమన్నారు. మీర్పేట లెనిన్నగర్తో పాటు బడంగ్పేటలో మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలతో పాఠశాల భవన నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. తొలుత సిరిసిల్లలో పాఠశాలలను అభివృద్ధి చేద్దామనుకున్న మేగా సంస్థ.. మహేశ్వరం నియోజకవర్గంలో చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, డీఈఈ అశోక్ రెడ్డి, ఎంఈఓ డి. కృష్ణయ్య, మెగా మేనేజర్ నూక రాజు, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్, రోహిణి రమేశ్, పెద్ద బావి అశోభా ఆనంద్రెడ్డి, పెద్దబావి శ్రీనివాస్రెడ్డి, పెద్దబావి దర్శన్రెడ్డి, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి, యాతం పవన్ కుమార్ యాదవ్, లిక్కి మమత కృష్ణారెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, నాగ నందీశ్వర్రెడ్డి, తదితరులు ఉన్నారు.
సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయండి
మీర్పేట మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు సుందరీకరణ పనులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. చెరువు పనులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, డీఈఈ గోపీనాథ్, టీఆర్ఎస్ నాయకులు దీప్లాల్ చౌహాన్, అర్కల కామేశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.