మహేశ్వరం, అక్టోబర్ 28: మహేశ్వరం నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తుది శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బాబాయ్య ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారందరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకుముందు మీర్పేటలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు మరోసారి సేవ చేయడానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం కల్పించారన్నారు. 30 రోజులు నాకోసం పనిచేస్తే శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. సబితమ్మ వెనుక ఉన్న బలాన్ని చూసి ఢిల్లీలో చర్చలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మెట్రో రైలు పరుగులు పెడుతుందని, మెడికల్ కళాశాలలు ఏర్పాటు అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఇన్చార్జి ఎంపీపీ సునీత అంద్యానాయక్, కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్, పాండు యాదవ్, కూన యాదయ్య, సుధీర్ గౌడ్, కర్నాకర్ రెడ్డి, అంజయ్య ముదిరాజ్, లచ్చనాయక్, సమీర్, యాదగిరి, చంద్రయ్య ఉన్నారు.