‘ప్రధాని మోదీ వంటింట్లో చిచ్చు పెట్టిండు. 8 ఏండ్ల కింద గ్యాస్ ధర రూ.400.. ఇపుడు రూ.1052. సబ్సిడీ తగ్గించి పేద,మధ్యతరగతి కుటుంబాలను ఆగం చేస్తున్నరు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు వల్ల నిత్యావసరాలు, కూరగాయలు ధరలు కాశాన్నంటుతున్నాయి. ఆడవాళ్లతో పెట్టుకున్న బీజేపీకి పుట్టగతులుండవు. గ్యాస్ ధర తగ్గించకుంటే ఇక్కడి మహిళలు చీపుర్లు మలిచి సిద్ధంగా ఉన్నారు. ధర తగ్గించే వరకు పోరాటాలు చేస్తాం. తుక్కుగూడ సభలో పెద్దపెద్ద మాటలు మాట్లాడినోళ్లు ముందు తెలంగాణకు ఏం చేసిండ్రో చెప్పాలి. అమిత్షా మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నరు. రాష్ర్టానికి వచ్చే కంపెనీలను గుజరాత్కు తీసుకపోతున్నరు. ఇదేనా మీ నీతి? ఇదేనా మీ అభివృద్ధి? తెలంగాణ అంటే బీజేపీకి పక్షపాతం’ అని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంటగ్యాస్ ధరల మోతను వ్యతిరేకిస్తూ ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. అంతకుముందు గులాబీశ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ధర్నాలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు కార్తీక్రెడ్డి, మీర్పేట, బడంగ్పేట మేయర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆడోళ్లతో పెట్టుకుంటే బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులుండవని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. మహిళలు కొంగు నడుముకు చుట్టి.. చీపుర్లు చేత పట్టి.. దండు కట్టి.. మోదీకి మహిళల శక్తి ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు. అమిత్ షా తుక్కుగూడకు ఎందుకు వచ్చావ్.. మతకలహాలు సృష్టించడానికేనా అంటూ ప్రశ్నించారు. మీరు పెంచిన ధరలతో మహిళలు కంటనీరు పెడుతున్నారు.. కనిపించిందా.. అని నిలదీశారు. తెలంగాణకు ఏం ఇచ్చారు.. ఏం ఇవ్వబోతున్నారు.. చెప్పకుండానే వెనుదిరిగారని, అక్కడి నుంచి ఇక్కడిదాక వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికేనా అంటూ ప్రశ్నించారు. లోకల్ లీడర్లకు, ఢిల్లీ లీడర్లకు తేడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
బడంగ్పేట, మే 15: పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బాలాపూర్ చౌరస్తాలో నిర్వహించిన మహాధర్నాలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అంతకుముందు ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి బడంగ్పేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాధర్నా ప్రాంగణానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలతో కలిసి పాదయాత్రగా తరలివచ్చారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.కార్తిక్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మహాధర్నా కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
కట్టెల పొయ్యి ఇచ్చి.. గ్యాస్ పొయ్యి తీసుకు పో మోదీ జీ
గ్యాస్ ధరలు ఇష్టారీతిన పెంచి ప్రజల నెత్తిన పిడుగు మోపుతున్న మోదీజీ.. ఇక నీ గ్యాస్ పొయ్యితో ఏగలేము, కట్టెల పొయ్యి ఇచ్చి.. గ్యాస్ పొయ్యి పట్టుకుపోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రధాని మోదీకి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పక్షపాతిగా పనిచేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి మహిళల కంట కన్నీరు పెట్టిస్తున్నదని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు ఆకాశానికి అంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్లు, మహిళలకు కిట్లు అందజేస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళలకు కష్టాలు తెచ్చి పెడుతున్నదని అన్నారు. రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఇక్కడి పథకాలు మీరు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్షాను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుంజుకు పోతున్నదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏంచేసిందో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్లతో పెట్టుకుంటే బీజేపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.
రూ.400 ఉన్న గ్యాస్ ధరను రూ.1052 కు పెంచి పేదల నెత్తిన గుదిబండ మోపిందని, గ్యాస్ అనే పదం వింటేనే మహిళలకు వణుకు పుడుతున్నదని అన్నారు. కట్టెల పొయ్యి ఇచ్చి.. గ్యాస్ పొయ్యి తీసుకు పో మోదీ జీ అంటూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు వచ్చిన కంపెనీలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ర్టాలకు మళ్లిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల కండ్లలో మట్టి కొడుతున్నదని., దానిపై ఇక్కడి బీజేపీ నాయకులకు ప్రశ్నించే దమ్ములేక.. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని బట్టి చూస్తే ఇక్కడి బీజేపీ నాయకులకు ఏమి చేతకాదని అర్థమవుతున్నదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కార్తిక్ రెడ్డి, మేయర్లు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, దుర్గా దీలాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి, మహేశ్వరం మండల అధ్యక్షుడు రఘుమారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, కామేశ్ రెడ్డి, నగేశ్, మహేందర్ రెడ్డి, రాజునాయక్, ఖలీఫా, మల్లె జయేందర్, లక్ష్మయ్య, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
అబద్ధాల బీజేపీకి బుద్ధి చెప్పాలి: ఎంపీ రంజిత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పాలని ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఢిల్లీలో ధర్నా చేసినా, గ్యాస్ ధరలు తగ్గించాలని ఎన్ని ఆందోళనలు చేపట్టినా.. కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నదని, ఇక అబద్ధాల బీజేపీ అని నామకరణం చేసుకోవాలని సూచించారు. మన ఊరు.. మన బడి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు నిధులు ఇచ్చిందో చెప్పాలన్నారు. బీజేపీ నేతల మధ్య సమన్వయం కొరవడిందని, ఎవరు ఏమి మాట్లాడుతారో వారికే అర్థం కావడంలేదని అన్నారు. బండి సంజయ్ అధికారం కోసం అరాట పడుతూ ఏం మాట్లాడుతున్నాడో అతడికే తెలియదని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
జీఎస్టీ పేరుతో బీజేపీ ఖాతాల్లో నల్ల ధనం: తీగల అనితా రెడ్డి
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో బీజేపీ ఖాతాల్లో నల్లడబ్బు జమచేసుకుంటున్నదని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి ఆరోపించారు. ఇష్టారీతిన ధరలు పెంచి దేశాన్ని దివాలా తీయిస్తున్నారని, భారత దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారో అర్థ్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందో చెప్పకుండా అబద్దపు ప్రచారం చేస్తున్నారని, బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. మహిళల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని, పెంచిన ధరలు తగ్గించే వరకు పోరాటం ఆగదన్నారు.
బతికేది కష్టంగా మారింది
వంటగ్యాస్ ధర పెరుగడంతో వంటింట్లోకి వెళ్లాలంటేనే భయం వేస్తున్నది. దీనికి తోడు నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో బతికేది కష్టంగా మారింది. వంటగ్యాస్ ధర రూ.1050 దాటితే, లీటరు నూనె రూ.200 దాటింది. జీతాలు మాత్రం పెరగడంలేదు. ఇలా ఉంటే ఎలా వండుకోవాలి, ఏం తినాలి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి పేదలపై భారం మోపుతున్నది. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలి. – సునీత, శ్రీరాం కాలనీ
బీజేపీకి సున్నా డిజిట్ ఖాయం
రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, మే15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సింగిల్ డిజిట్ నుంచి సున్నా డిజిట్కు దిగజారడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అభివృద్ధి చేయని బీజేపీ తెలంగాణలో ఏమి చేస్తుందని ప్రశ్నించారు. రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి ఎప్పుడైనా నిధులు తెచ్చారా? అని నిలదీశారు. అమిత్షా సభకు కిరాయి మనుషులను తెచ్చి విజయవంతమైనట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఇక్కడి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
మహిళలతో పెట్టుకోవద్దు
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు బతుకు భారంగా మారుతున్నది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో అన్నింటిపై ప్రభావం పడిం ది. ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నారు. మహిళలకు వంటింటి కష్టాలు తెచ్చి పెడుతున్నారు. ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మహిళలతో పెట్టుకోవద్దు. అందుకు తగిన మూల్యం అనుభవిస్తారు. – మాధవి, లిబ్రా ఎన్క్లేవ్