బడంగ్పేట, నవంబర్ 19: ఆడ బిడ్డను ఆశీర్వదించి.. అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవేందర్నగర్, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్లో ఆదివారం రోడ్ షో నిర్వహించగా, అపూర్వ స్పందన లభించింది. అడుగు అడుగునా ప్రజలు మంత్రికి నీరాజనాలు పలికారు. మంగళ హారతులు పట్టి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కనిపించని నాయకులు ఓట్ల కోసం వస్తే ప్రజలు ఎవరూ ఆదరించరన్నారు. ముఖం తెలియని నాయకులు ఓట్ల కోసం ప్రజల దగ్గర గ్యారడి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు. మూడు గంటల కరెంటు సరిపోతుందని చెబుతున్నారన్నారు. మాయగాల మాటలను ప్రజలు నమ్మకూడదన్నారు. బీజేపీకి ఓట్లు వేస్తే మతకల్లోలాలు సృష్టిస్తారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ ప్రజలకు చేసింది ఏమిలేదన్నారు. ప్రజల పైన పన్నుల భారం మోపిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజల పై మోయలేని భారం మోపారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీలన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని, ఓట్లు అడిగే అర్హత బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. తుక్కుగూడ ఐటీ కారిడార్గా మారబోతున్నదన్నారు. వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో40 కోట్లతో 11 చెరువులను సుందరీకరణ చేసినట్లు పేర్కొన్నారు. 13 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. కార్పొరేటర్లు యాతం పవన్ కుమార్, శివకుమార్, బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.