పహాడీషరీఫ్, జూన్ 12 : పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆమె జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3,6,7,8 వార్డుల్లో రూ. 45 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 4వ వార్డులో ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారి కోసం వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా వచ్చి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో విద్యార్థులకు దూరదర్శన్, టీ సాట్ ద్వారా ఆన్ లైన్లో డిజిటల్ తరగతులు నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. బడ్జెట్లో రూ 4వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఓఎస్ జూనియర్, డిగ్రీ కాలేజీల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ ఫర్హాన్ నాజ్, ఎంఈవో కృష్ణ, ప్రధానోపాధ్యాయుడు అమర్నాథ్రెడ్డి, కమిషనర్ జి.పి కుమార్, ఏఈ కిష్టయ్య, కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.