మాదాపూర్, మే 1: కష్టపడితేనే నేటి కాలంలో భవిష్యత్ ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మాదాపూర్లోని న్యాక్ ఆడిటోరియంలో సోమవారం సీడీఐ (కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్), బీఏఐ, న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్స్ట్రక్షన్) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ నిర్మాణ రంగ కార్మిక ప్రతిభా పురస్కారాలు- 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.
బీఏఐ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఎస్. నరసింహరెడ్డి, ఆల్ ఇండియా, బీఏఐ మాజీ అధ్యక్షుడు శీనయ్య, మాజీ తెలంగాణ రాష్ట్ర బీఏఐ చైర్మన్ కె. దేవేందర్రెడ్డి, బీఏఐ మాజీ చైర్మన్ ఎన్. సచితానందరెడ్డి, వి. భాస్కర్రెడ్డి, సెక్రటరీ పి.భాస్కర్రెడ్డి, న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, సీడీఐ చైర్మన్ సోమ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ సుధాకర్తో పాటు పలువురు ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తూ.. ఎన్నో ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అదృష్టం అంటే కష్టపడి పనిచేస్తేనే వస్తుందని, గాలిలో దీపం పెడితే రాదని చెప్పారు. ప్రతి రోజు కష్టపడి తాను ఈ స్థాయికి వచ్చానని, ప్రతి ఒక్కరూ కష్టపడి భవిష్యత్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో నిపుణులైన ఇంజినీర్లతోనే యాదగిరిగుట్ట, సచివాలయం వంటి గొప్ప నిర్మాణాలు చేయడం సాధ్యమైందన్నారు. అనంతరం సీడీఐలో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి తెలంగాణ నిర్మాణ రంగ కార్మిక ప్రతిభా పురస్కారాలను అందజేశారు.