దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దళితులను వ్యాపారాల్లో రాణించే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండో విడత దళితబంధు విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటి దశలో 500 మందికి రూ.50 కోట్లు అందించగా.. దళితులు వ్యాపారాలు చేసుకుంటూ జీవితంలో స్థిరపడుతున్నారని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేసి దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
మేడ్చల్, జూలై 3 (నమస్తే తెలంగాణ): దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం మొదటి విడత విజయవంతమైన నేపథ్యంలో రెండో విడత దళితబంధు పథకాన్ని లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకర్గాల్లో రెండో విడత దళితబంధు పథకానికి సంబంధించి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా 5,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈమేరకు దళితుల నుంచి దరఖాస్తుల స్వీకరణను అధికారులు ప్రారంభించారు. రెండో విడత దళితబంధు పథకానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు నియోజకవర్గాల వారీగా ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమించారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ప్రత్యేక అధికారులు కలిసి అర్హులను ఎంపిక చేయనున్నారు. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, వారు వివిధ వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
దరఖాస్తుల స్వీకరణ అనంతరం దరఖాస్తులను మండల స్థాయి అధికారులు పరిశీలించనున్నారు. దరఖాస్తుల ఆధారంగా దరఖాస్తుదారుల ఇంటికి నేరుగా వెళ్లి పరిశీలించి అర్హులను గుర్తించనున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దళితబంధు పథకం అమలుచేస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు.. ఎంపిక చేసుకున్న వ్యాపారాలపై శిక్షణ తరగతులను నిర్వహించి దళితబంధు పథకం నిధిని లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలాజీ తెలిపారు.