ఘట్కేసర్, సెప్టెంబర్ 28: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించే కల్యాణ మండపం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు భక్తుల సహకారంతో కొనసాగుతున్నాయన్నారు. కల్యాణ మండప నిర్మాణం కోసం దేవాదాయ శాఖ రూ.50లక్షలు కేటాయించగా, మిగతా మొత్తాన్ని భక్తులు,గ్రామస్తులు సమకూర్చి పనులు నిర్వహిస్తున్నారని అన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెండ్లి కష్టాలను షాదీముభారక్, కల్యాణ లక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ తీరుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఘట్కేసర్,పో చారం మున్సిపాలిటీలు,ఘట్కేసర్ మండల గ్రామాలకు చెందిన మొత్తం 63 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం చేపట్టి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమలో జడ్పీచైర్మన్ శరత్చంద్రారెడ్డి,ఘట్కేసర్ చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్, పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి, కౌన్సిలర్లు,ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మండల శాఖ అధ్యక్షుడు రమేశ్,తహసీల్దార్ కృష్ణ,ఆలయ ఈఓ భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ బి.రాజేశ్గౌడ్,దాతలు సత్తిరెడ్డి,యాదగిరి రెడ్డి, నర్సింహ,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
మేడ్చల్, సెప్టెంబర్ 28: శామీర్పేట మండలం ఆలియాబాద్ గ్రామ శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి మంత్రి చామకూర మల్లారెడ్డి రూ.10 లక్షలు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేశారు. ఇందుకుసంబంధించిన పత్రాలను గురువారం మంత్రి బోయినిపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులకు అందజేశారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ కుమార్, రైతుబంధు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు గౌస్పాష, జలాల్పాష, ఇమ్రాన్ పాల్గొన్నారు.
బోడుప్పల్, సెప్టెంబర్28: బోడుప్పల్ నగరపరిధిలో శుక్రవారం ఉదయం 9గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరవుతున్నట్లు కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి పనులను సుమారు రూ.4.28 కోట్లతో ప్రారంభించనున్న నేపథ్యంలో పాలకవర్గం సభ్యులు, స్థానిక నాయకులు విధిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.