శామీర్పేట, సెప్టెంబర్ 6 : బీజేపీ, కాంగ్రెస్లకు ఓటు అడిగే అర్హత లేదని, వాళ్లకు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ల కథ కంచికి చేరిందనే విషయాన్ని మరిచిపోయి.. ప్రజలకు మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి వస్తున్నారని నిప్పులు చెరిగారు. శామీర్పేట గ్రామంలో 140 మందికి, బొమ్మరాశిపేట గ్రామంలో 76 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రఘునందన్రావు, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచ్లు బాలమణి, గీతమహేందర్, ఎంపీటీసీలు సాయిబాబా, ఇందిరా, అశోక్, తాసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో వాణి, రైతుబంధు మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ రమేశ్యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు మేడి రవి, వార్డు సభ్యులు, మాజీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, మహేందర్యాదవ్, వెంకట్రెడ్డి, ఆనంద్గౌడ్, సోనీ, నర్సింహారెడ్డి, డేవిడ్, భిక్షపతి, పవన్ముదిరాజ్, బీఆర్ఎస్ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చెల్లని రూపాయి.. కాంగ్రెస్
దేశంలో ఎక్కడికి పోయినా.. కాంగ్రెసోల్ల పని చెల్లని రూపాయిలెక్క మారిందని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. బొమ్మరాశిపేటలో మేమిచ్చినం.. మేమిచ్చినం అని చెప్పుకోవడం తప్పితే చేసిందేమి లేదని అన్నారు. నాడు వాళ్లు ఇచ్చిన పట్టాలను ప్రజలు మరిచిపోయి ఏండ్లు అయ్యిందని తెలిపారు. కాళీ స్థలంగా ఉండటంతో ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రభుత్వ స్థలంగా మారిందని ప్రజలకు కేటాయించిన స్థలాలను వేరే పనికి ఉపయోగించడం కుదరదని తేల్చి చెప్పి ఆ భూమిని తిరిగి ప్రజలకు ఇచ్చేందుకు ఈ ప్రయత్నం అన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి బొమ్మరాశిపేటలో ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిన భూమిని తిరిగి పట్టాలుగా మార్చి అందిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట మేరకు బొమ్మరాశిపేట, కండ్లకోయ, శామీర్పేటలో ప్లాట్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే ఉప్పర్పల్లిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టాలు పొందిన ప్రతి ఒక్కరికీ 2వ విడతలో గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు అందజేస్తామన్నారు.
దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలో..
అనునిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఏం కావాలన్నా చేసిపెడుతున్నాడని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఆసరా పింఛన్ ప్రతి ఒక్కరికీ అందుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెసోళ్ల కండ్లు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని.. కేవలం రూ.200 పింఛన్ కోసం ఎవరైనా చస్తారేమోనని ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేదన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ ఇవ్వడంతో పాటు నవంబర్లో దివ్యాంగులకు మరో రూ.వెయ్యి పెంచిందని గుర్తు చేశారు.