దళితుల అభ్యున్నతికే ‘దళితబంధు’ పథకం
ఆశయం వారిది.. సర్కారు వారధి
ఒక్కో నిరుపేద కుటుంబానికి రూ.10 లక్షలు
40 రకాల వ్యాపారాలు చేసుకునే అవకాశం
తొలివిడుతలో మేడ్చల్ జిల్లాలో 561 మంది లబ్ధిదారులు
మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి మల్లారెడ్డి
దళితులు గౌరవంగా బతికేందుకే పథకమని వెల్లడి
త్వరలో రెండోవిడుత లబ్ధిదారుల ఎంపిక
ఆదరణ లేక అనాదిగా ఆర్థికంగా వెనుకబడిపోయారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి జీవితాల్లో మార్పురాలేదు. పేదరికమే వారసత్వంగా జీవిస్తున్న దళితులు సమాజంలో గౌరవంగా ఉండేందుకు సర్కారు ప్రారంభించిన దళితబంధు పథకం వారి ఉన్నతికి బాటలు వేయనుంది. నియోజకవర్గానికి 100 మంది చొప్పున మేడ్చల్ జిల్లాలో తొలివిడుత 561 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇప్పటికే రెండుసార్లు శిక్షణ ఇచ్చారు. మేడ్చల్ కలెక్టరేట్లో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మంగళవారం పలువురు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకం పెట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఒక్కో లబ్ధిదారుకు రూ.10 లక్షలు జమవుతాయని, వీటితో 40 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పారు. -మేడ్చల్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ)
కూలీ నుంచి ట్రాలీఆటో ఓనర్
మేడ్చల్ జిల్లా రాయిలపూర్కు చెందిన చింతల శంకర్ది నిరుపేద కుటుంబం. డిగ్రీ పూర్తిచేసి కుటుంబ పోషణ కోసం ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్న అతడికి దళితబంధు ఆశాకిరణమైంది. పథకానికి దరఖాస్తు చేసుకోగా అధికారులు ట్రాలీఆటో (గూడ్స్ వెహికిల్) మంజూరు చేశారు. పనిచేస్తున్న కంపెనీలోనే ఆటో కిరాయికిచ్చేందుకు యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. చిరు ఉద్యోగి నుంచి ఆటో ఓనర్గా మారుతున్నానని ఆనందం వ్యక్తం చేశాడు.
మేడ్చల్, ఏప్రిల్ 5 : నిజమైన దళితబంధు ముఖ్యమంత్రి కేసీఆరేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో ఎంపికైన 561 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీని కలెక్టరేట్లో మంగళవారం ప్రారంభించారు. అంతకు ముందు బాబు జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో దళితులు అభివృద్ధి సాధించాలని దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. మిగిలిన రాజకీయ పక్షాలు దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయని, దళితుల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
దళితబంధు పథకం లబ్ధిదారులు 40 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చని, ఇప్పటికే ఎంపిక చేసుకున్న వ్యాపారాలపై అధికారులు రెండు సార్లు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. వ్యాపార అనుమతులను అధికారులు దగ్గరుండి ఇప్పిస్తారని పేర్కొన్నారు. ఈ నెలలోనే రెండో విడత దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని చెప్పారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానందతో పాటు ఎమ్మెల్సీ నవీన్కుమార్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, జడ్పీటీసీ అనిత, ఎంపీపీలు, పాల్గొన్నారు.
సీఎం నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటా. ఈ పథకం ద్వారా డెయిరీని ప్రారంభించాలనుకుంటున్నా. నిత్యం పాల వ్యాపారం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి అయ్యేందుకు అహర్నిశలు కష్టపడుతా. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.
– భాగమ్మ, అంకిరెడ్డిపల్లి
అదృష్టంగా భావిస్తున్నా..
దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు ప్రవేశపెట్టడం సంతోషకరం. ఈ పథకం ద్వారా వ్యాపారానికి రూ. 10 లక్షలు ప్రభుత్వం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. నేను సెంట్రింగ్ వ్యాపారాన్ని ఎంపిక చేసుకున్నా.. ఈ వ్యాపారాన్ని విస్తరించుకుని ఆర్థికంగా
అభివృద్ధి చెందుతాం. – మంజు, అంకిరెడ్డిపల్లి
దళితబంధు పథకం ద్వారా రూ.10 లక్షలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం. ఇలాంటి పథకాలు గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. దళితుల కోసం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలుస్తాడు. పాలడెయిరీని ఎంపిక చేసుకున్నా.. వ్యాపార అభివృద్ధికి కష్టపడుతా. –సాయిలు, మేడ్చల్
ఆర్థికంగా నిలదొక్కుకుంటా..
దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానం మాకు నచ్చింది. దళితబంధు పథకంలో ఫ్లవర్ ప్లాంటేషన్ను ఎంపిక చేసుకున్నా.ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటా. – రాములు, పోతారం