మేడ్చల్ రూరల్, నవంబర్ 20 : కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఆగం కావొద్దని.. అభివృద్ధిని చూసి ఓటేయాలని బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని సోమారం, ఎల్లంపేట, సైదోనిగడ్డ తండా, రావల్కోల్ గ్రామాల్లో సోమవారం మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. తండాలు, పల్లెలను సీఎం కేసీఆర్ పంచాయతీలుగా మార్చడంతో అవి అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని తెలిపారు. గిరిజనులు స్వయం పాలనతో తండాలను బాగు చేసుకున్నారని, ఆధునిక గ్రామ పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలో ఘనమైన అభివృద్ధి చేశామని, తనను మరోసారి గెలిపించాలన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి మాయమాటలు చెప్పే వారి మాటలు నమ్మొద్దని, 50 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ఓ విజన్తో పని చేస్తూ ప్రజల కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపరిచి, ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయనందరెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా సోమారం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల యువ నాయకులు 50 మంది మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే పీర్జాదిగూడలోని ఎంకేబీఆర్ హాలులో కార్పొరేటర్ శశిరేఖ బుచ్చియాదవ్ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్ వెంకట్రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు.