మన రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, సంక్షేమంలో మనమే నంబర్ 1 అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం బీసీ చేతి కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం ప్రజల అదృష్టమని అన్నారు. ఏడు దశాబ్దాల చరిత్రలో కుల వృత్తులను ఎవరూ ప్రోత్సహించలేదని, అది సీఎం కేసీఆర్కే సాధ్యమయిందన్నారు. 245 మందికి రూ. లక్ష చెక్కులు పంపిణీ చేసిన మంత్రి, ప్రభుత్వ సాయంతో వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. బీసీలకు ఇచ్చే ఆర్థిక సహాయం నిరంతర ప్రకియగా కొనసాగుతుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
– మేడ్చల్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)
మేడ్చల్, ఆగస్టు12(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్న కులవృత్తులకు పునర్జీవం పోసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన బీసీ చేతి కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 70 ఏండ్లలో ఎన్నో ప్రభుత్వాలు పాలించాయని, కాని కులవృత్తులను పట్టించుకోలేదన్నారు.
తొమ్మిదేండ్లలోనే వివిధ కులాలకు చేయూతనందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందాలని బీసీ కులవృత్తిదారులకు సూచించారు. బీసీలకు ఇచ్చే ఆర్థిక సహాయం నిరంతర పక్రియగా కొనసాగుతుందని.. 15 కులాలకు చెందిన అర్హులైన వారికి పథకం వర్తింపజేస్తున్నామని వివరించారు. కంట్మోనెంట్ ప్రాంతం మీదుగా ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు, ప్యాట్నీ సెంటరు నుంచి తూంకుంట వరకు ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు ప్రణిత, చంద్రారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కేశూరామ్ తదితరులు పాల్గొన్నారు.
245 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ..
జిల్లా కలెక్టరేట్లో 245 మందికి మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా బీసీ చేతి కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 22,077 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 16,600 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు.