మేడ్చల్ /శామీర్పేట, జూన్ 8 : ఎండలు మండిపోయే మే, జూన్ నెలల్లో నీటి గల గలలు విన్పిస్తున్నాయని, చెరువులు జలకళను సంతరించుకున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట పెద్ద చెరువు వద్ద గురువారం నిర్వహించిన ‘ఊరూరా చెరువుల పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవన్నారు. వ్యవసాయానికి నీళ్లు, కరెంట్ ఉండేది కాదన్నారు. ఎండా కాలం వచ్చిదంటే గోదలకు నీళ్లు దొరికేవి కావని, గడ్డిని కొనుక్కోవాల్సిన దుస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బిడ్డ అయిన సీఎం కేసీఆర్ ముందుచూపుతో చెరువులను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడిక తీయడం, తూములను బాగు చేయడం, కట్టలను పటిష్టపటిష్టపర్చడం లాంటి చర్యలు తీసుకున్నారని చెప్పారు. సాగు, తాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని తెలిపారు. ఒకప్పుడు గోదావరి పుష్కరాలకు వెళ్లి తెచ్చిన నీటిని తల మీద చల్లుకునే పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం స్నానానికి, తాగడానికి కూడా గోదావరి నీళ్లు వినియోగించగలుతున్నామని పేర్కొన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ కృషి వల్లే సాధ్యపడిందని పేర్కొన్నారు.
మెరుగుపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ..
సీఎం కేసీఆర్ ముందుచూపుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ అన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పంటల ఉత్పత్తి పెరిగిందన్నారు. ధాన్యం ఉత్పత్తి 45 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.60 లక్షల కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. కాకతీయుల కాలంలో 80వేలు చెరువులు ఉంటే ఉమ్మడి రాష్ట్రంలోని పాలకుల కుట్రల వల్ల 50వేల వరకు మాయమయ్యాయని చెప్పారు. ఉపాధి కరువై వేల మంది గ్రామీణ యువత, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నక్సలైట్లలో కలిసి, బూటకపు ఎన్కౌంటర్ల బారిన పడ్డారన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిందని చెప్పారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టగానే మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను బాగు చేయడంతో పాటు చెరువులను కాపాడేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడిందని, నీటి లభ్యత పెరగడంతో పరిశ్రమలు తరలివచ్చాయని గుర్తు చేశారు.
చెరువు పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానికే వదిలివేయకుండా ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. అంతకు ముందు మంత్రి మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు అభిషేక్ అగస్త్య, ఏనుగు నర్సింహరెడ్డితో కలిసి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం శామీర్పేట కటమైసమ్మను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఫిష్ ఫుడ్ ఫెస్ట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూబాయి, జడ్పీటీసీ అనిత, వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచ్ బాలమణి, ఎంపీటీసీ సాయిబాబా, డీపీవో రమణమూర్తి, జడ్పీ సీఈవో దేవసహాయం, మత్స్య శాఖ జిల్లా అధికారి పూర్ణిమ, తాసిల్దారు సత్యనారాయణ, ఎంపీడీవో వాణి, నీటిపారుదల శాఖ ఏఈ ప్రశాంత్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఐలయ్య, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, చెరువు చైర్మన్ యాదగిరి ముదిరాజ్ పాల్గొన్నారు.
కుల వృత్తులకు రూ.లక్ష సాయం
వెనుకబడిన కులాలకు చెందిన వారికి రూ.లక్ష సాయం అందించే కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు. విశ్వబ్రాహ్మణులు, అవుసలి, కమ్మరి, వడ్డెర, రజక తదితర కులాలకు చెందిన వారు రూ.లక్ష పొందవచ్చన్నారు. అలాగే పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభం కానుందని చెప్పారు.