ఘట్కేసర్ రూరల్, నవంబర్ 10: అభివృద్ధికి కేరాఫ్ అయిన బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలను కోరారు. మండల పరిధి మర్పల్లిగూడ, ఎదులాబాద్ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎదులాబాద్లోని శ్రీ గోదా సమేత శ్రీరంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ స్థానం లో నిలిచిందన్నారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఆరు సంవత్సరాల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. నిరంతర విద్యుత్, సాగు, తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల్లో ఉహించని అభివృద్ధిని చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఉన్న పథకాలకు మంగళం పాడి దోపిడీ చేస్తారన్నారు.
బోడుప్పల్: దశాబ్దకాలంలో శతాబ్ది అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కావాలా… కుట్రలు, కుతంత్రాలు, స్కాంలతో వేలకోట్లు దోపిడీ చేసిన కాంగ్రెస్ పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ప్రజలకు సూచించారు. శుక్రవారం బోడుప్పల్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ…ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ విజయాన్ని, మంత్రి మల్లారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ముఖ్యమంత్రి సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం తథ్యమని పేర్కొన్నారు.
సర్వేల పేరుతో బీఆర్ఎస్ డబ్బులు పంపిణీ చేస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి , మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.బోడుప్పల్ నగరపరిధిలోని 80వేల పైచిలుకు ఓట్లలో 60వేలు ఓట్లు బీఆర్ఎస్కు ఏకపక్షంగా వేయడానికి వివిధ కులసంఘాలు, కాలనీవాసులు తీర్మానాలు చేసుకున్నారని తెలిపారు. 1లక్ష మెజార్టీతో మల్లారెడ్డి విజయధుందుబి మోగిస్తారని ధీమావ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు, పారదర్శక పాలనకు ఇంటింటి ప్రచారంలో జనం నీరాజనం పలుకుతున్నారని పలుకుతున్నారని మంద సంజీవరెడ్డి అన్నారు. రూ.400 గ్యాస్ సిలిండర్, రూ.16000 రైతుబంధు పెంపు, కేసీఆర్ భరోసా, కేసీఆర్ ఆసరా, రూ.5016కు పింఛను పెంపు, అన్నపూర్ణ పథకం ద్వారా పేదలకు సన్నబియ్యం సరఫరా, అర్హులైన మహిళలకు 3000 గౌరవభృతి, రూ.6000 దివ్యాంగుల పింఛన్ పెంపు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు తదితర పథకాలను మ్యానిఫెస్టోలో చేర్చడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, యువజన విభాగం కార్యకర్తలు ఉన్నారు.
పీర్జాదిగూడ: మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి చామకూర మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పీర్జాదిగూడ కార్పొరేషన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్రెడ్డి అన్నారు. శుక్రవారం 25వ డివిజన్లో నాయకులతో కలిసి ఇంటింటికీ ప్రచారాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, వార్డు కమిటీ సభ్యులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
శామీర్పేట: జడ్పీటీసీ అనితలాలయ్య ఆధ్వర్యంలో శామీర్పేట మండలం అలియాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నిక ప్రచారం శుక్రవారం నిర్వహించారు. అదే విధంగా శామీర్పేట, మురహార్పల్లి, బాబాగూడ, పొన్నాల్, యాడారం, మజీద్పూర్, మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్, మూడుచింతలపల్లి, ఆద్రాస్పల్లి, తూంకుంట మున్సిపాలిటీలో ఎన్నిక ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్క కుమార్యాదవ్, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జగదీశ్గౌడ్, వార్డు సభ్యులు రాజు, మధు, తాడెం కుమార్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు