మేడ్చల్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి మట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉన్నదని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్ని ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో రెండు లక్షల 13 వేల మందికి ఉపాధి లభిస్తున్నదని అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో జిల్లా వ్యాప్తంగా 13,289 మంది లబ్ధిదారులకు రూ. 132 కోట్లు అందజేశామన్నారు. మిషన్ భగీరథ ద్వారా వోఆర్ఆర్ వెలుపల ఉన్న 45,620 గృహాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లాలోని ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులైన కాశీవిశ్వనాథం, జానబాయిని ఘనంగా మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్, మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, కుషాయిగూడ ఏసీపీ రష్మిత పెరమల్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని పెంపొందించే విధంగా నిర్వహించిన కార్యక్రమాలపై మంత్రి మల్లారెడ్డి విద్యార్థులను అభినందించారు.
వృద్ధులకు ఆసరా పింఛన్లు మంజూరు..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 57 ఎండ్లు నిండిన వృద్ధులకు ఆసరా పింఛన్లను ప్రభుత్వం మంజూరీ చేసిన పత్రాలను మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ పంపిణీ చేశారు. జిల్లాలో కొత్తగా 48,558 ఆసరా పింఛన్లు మంజూరైనట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.