మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 1: ప్రతి పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్ అని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం, మేడ్చల్, మున్సిపాలిటీ పరిధిలోని ఆసరా లబ్ధిదారులకు గురువారం ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారన్నారు.
ఉమ్మడి పాలనలో ఇచ్చిన పింఛన్లు ఏమాత్రం సరిపోయేవి కావని, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులకు గురయ్యే వారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 పింఛన్ ఇస్తున్నారని తెలిపారు. 57 ఏళ్లకే పింఛన్ ఇవ్వడంతో లక్షలాది మందికి మేలు జరుగుతున్నదన్నారు. ఉమ్మడి పాలనలో 22 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేవారని, ఆ సంఖ్య టీఆర్ఎస్ రాష్ట్రం వచ్చిన తరువాత 48 లక్షలకు చేరిందన్నారు. కొత్తగా మరో 10 లక్షల మందికి మంజూరయ్యాయని వివరించారు.
గుజరాత్లో 13 లక్షల మందికే పింఛన్లు…
మన రాష్ట్రం కంటే రెట్టింపు జనాభా ఉన్న గుజరాత్లో 13 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతలు మాటలకే పరిమితమని, వారిని నమ్మితే కష్టాల పాలు కావాల్సిందేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.12వేలు కోట్లు ఖర్చు చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. మేడ్చల్ పట్టణంలోని శ్రీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆసరా కార్డులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జడ్పీటీసీ శైలజారెడ్డి, రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు విజయానందారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, వైఎస్ ఎంపీపీ వెంకటేశ్, నాయకులు , తాసీల్దార్ గీత, ఎంపీడీవో రమాదేవి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు , కమిషనర్ రాములు, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో చైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రమేశ్, కమిషనర్ అహ్మద్ షఫీయుల్లాహ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.