మేడ్చల్, సెప్టెంబర్ 8 : అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పెద్దన్నగా, కల్యాణలక్ష్మితో ఆడబిడ్డలకు మేనమామలాగా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ పట్టణంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. ఎంపీడీవో కార్యాలయంలో 89 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అంతకు ముందు తుమ్మ చెరువు కట్టపై సొంత నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును, రూ.67 లక్షలతో చేపడుతున్న జిల్లా గ్రంథాలయ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ తొమిదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు.
కల్యాణలక్ష్మి కింద రూ.1,00116 అందజేస్తున్నారని, దళితులను ధనవంతులు చేయాలని దళితబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటికే 100 మందికి దళిబంధు పథకం అమలు చేయగా, కొత్తగా 1100 మందికి అందజేయనున్నామని చెప్పారు. గృహలక్ష్మి పథకం కింద 3వేల మందికి రూ.3 లక్షల చొప్పున రూ.90 కోట్ల ఆర్థిక సాయం అందనుందని తెలిపారు. 14 బీసీ కులాలకు రూ.లక్ష చొప్పున అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే మైనార్టీ, గౌడ సోదరులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారని పేర్కొన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ, గొర్రె, కుర్మలకు రాయితీపై గొర్రెల పంపిణీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. ప్రతి వర్గానికి ఏదో ఒక రూపంలో న్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు.
దీంతో బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన ఆంగ్ల విద్యను అందజేస్తున్నారని తెలిపారు. ఇందుకోసం ఒక్కో విద్యారికి రూ.1.25 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. విదేశాలకు వెళ్లి, ఉన్నత విద్యను చదువుకునే బీసీ, ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు ఓవర్సీస్ పథకం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో వైద్య సదుపాయాలు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. బస్తీ, పల్లె దవాఖానలతో ఉచితంగా వైద్యం అందుతుందని, ఉస్మానియా, గాంధీ, జిల్లా దవాఖానల్లో మెరుగుపడిన సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను నమ్మి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కన్నా ముందు రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించిందన్నారు. అయినా ఏమి సాధించలేదని రాష్ర్టాన్ని దివాళా తీశారన్నారు. 56 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. ఇంటింటికీ నీళ్లిచ్చిండ్రా, 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రా ఏమి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. భారీ మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపించుకొని, కేసీఆర్ను మూడో సారి సీఎం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహ రెడ్డి, వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ కార్యకర్తలు పాల్గొన్నారు.