మేడ్చల్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికి ఇండ్ల కేటాయింపు జరిగేంత వరకు నిరంతరం పక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో శుక్రవారం మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్ సమక్షంలో ఆన్లైన్ లాటరీ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపును రాండమైజేషన్ స్టాఫ్వేర్ ద్వారా డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలందరు ఆత్మగౌరవంతో ఉండాలనే మంచి ఉద్దేశంతో డబుల్ బెడ్ రూమ్లను కట్టించి వాటిని అర్హులకు ఎంతో పారదర్శకంగా కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి పైరవీలకు జోక్యం లేకుండా లబ్ధిదారులకు అందజేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని డబుల్ బెడ్ రూమ్లను నిర్మించారన్నారు. నిరుపేదలకు సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాడన్నారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు నియోజకవర్గానికి 500ల మందిని ఎంపిక చేసినట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 1,75,959 దరఖాస్తులు వచ్చాయని, అర్హత కల్గిన వారు 24,717 మంది లబ్ధిదారులు ఉండగా మొదటి విడతలో 2000 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్లను అందజేస్తామన్నారు. దీని ద్వారా ఎంతో పారదర్శకత, జవాబుదారితనాన్ని సూచిస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగ్యస్త, జిల్లా డీఆర్వో హరిప్రియ, ఈఈ శ్రీనివాసమూర్తి, అధికారులు మోహన్ రావు, పరిశ్రమల జిల్లా మేనేజర్ రవీందర్ ఆర్డీవోలు రాజేశ్ కుమార్, శ్యామ్ ప్రకాశ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆన్లైన్ పక్రియ ద్వారా అర్హులకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. తక్కువ సమయంలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడం జరిగిందన్నారు. ఒకసారి ఎంపికైన లబ్ధిదారులు మళ్లీ ఎంపిక కాకుండా ఉండటానికి ఆధార్ నెంబర్ ప్రతిపాదికన దీనిని రూపొందించడం జరిగిందన్నారు. ఎంపిక జరిగిన తర్వాత అందుకు సంబంధించిన డాటాను ఎట్టి పరిస్థితులల్లో తారుమారు చేయడానికి వీల్లేకుండా ఒక రహస్య కోడ్ ద్వారా నమోదు చేయడం జరుగుతందని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు.