పీర్జాదిగూడ, ఆగస్టు 2 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చారిత్రక నిర్ణయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మెట్రో విస్తరణతో పాటు టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పీర్జాదిగూడ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట స్థానిక మేయర్ జక్క వెంకట్రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ప్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నలుదిక్కులా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. సుమారు రూ.69 వేల కోట్ల నిధులతో మెట్రోను విస్తరించి ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు.
దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజలు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు మెట్రోను విస్తరించడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ హైవేపై నిర్మిస్తున్న కారిడార్ పనులు ఐదేండ్లు గడుస్తున్నా 50 శాతం పనులు పూర్తి కాలేదని, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఏనాడు కూడా ఉప్పల్, నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ గురించి మాట్లాడలేడు కానీ.. ఇటీవల చూసేందుకు వచ్చాడని ఎద్దేవ చేశారు. తాము రోడ్డు దుస్థితిపై సీఎం కేసీఆర్కు వివరించడంతో వెంటనే స్పందించి రాష్ట్ర ఆర్అండ్బీ విభాగం నిధులతో రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మేడ్చల్ గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, బోడుప్పల్ పార్టీ అధ్యక్షుడు, మంద సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్ నమ్య, కార్పొరేటర్లు, హరిశంకర్రెడ్డి, అనంతరెడ్డి, మంజులరవీందర్, యుగేందర్రెడ్డి, బచ్చరాజు పోచయ్య, నాయకులు సతీశ్ గౌడ్, రవీందర్, శ్రీధర్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, శ్రీకాంత్గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.