మేడ్చల్, డిసెంబర్29(నమస్తే తెలంగాణ): ఎన్ఎన్డీపీ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి మల్లారెడ్డి, ఎస్ఎన్డీపీ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్ల పరిధిలో శాశ్వత ముంపు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.110 కోట్లు మంజూరు చేసిందన్నారు. నిధులు మంజూరైనందున పనులను త్వరగా పూర్తి చేసి ముంపు సమస్యను పరిష్కరించాలన్నారు. సంబంధిత అధికారులు పనులను తరచూ పర్యవేక్షించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో మేయర్లు జక్క వెంకట్రెడ్డి, బుచ్చిరెడ్డి, ఎస్ఎన్డీపీ డీఈ పవన్, వాటర్ వర్క్ జీఎం శ్రీనివాస్రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.