జూబ్లీహిల్స్, నవంబర్10 : రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామని.. పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం యూసుఫ్గూడ ఫస్ట్ పోలీస్ బెటాలియన్లో టీఎస్ఎస్పీ కన్వెన్షన్ సెంటర్ను డీజీపీ మహేందర్ రెడ్డి, బెటాలియన్స్ అదనపు డీజీ అభిలాష బిస్త్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
నగరంలో అత్యంత విశాలమైన స్థలంలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో పోలీసు వ్యవస్థలో అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టడంతో రాష్ట్రంలో తీవ్రవాదం, మతవాదం, ఘర్షణలు సద్దుమణిగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ ఏకే మిశ్రా, సిబ్బంది పాల్గొన్నారు.