చంపాపేట/బేగంపేట్, జూన్ 21: ప్రమాదవశాత్తు బుధవారం నిర్మాణంలో ఫ్లైఓవర్ స్లాబ్ కూలిపోయింది. తొమ్మిది మంది కూలీలకు స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి ఆరోగ్యం మెరుగుపడటంతో బుధవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. మిగిలిన ఏడుగురికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలందిస్తున్నట్టు వైద్యలు వెల్లడించారు. బీఎస్సీపీఎల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఫ్లైఓవర్ కూలి గాయాలైనట్లు ఈ ఘటనలో గాయపడిన కోరి రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ డీసీపీ బి.సాయిశ్రీ, ఏసీపీ శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్ పరిధి సాగర్ రింగ్రోడ్డు జంక్షన్ సమీపంలోని బైరామల్గూడ చెరువు పక్కనుంచి బొల్లినేని శ్రీనయ్య కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఎస్సీపీఎల్) కంపెనీ గత కొంతకాలంగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టింది.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి కొంత మంది కార్మికులు వచ్చారు. వారంతా అక్కడే ఉన్న ఫ్లైఓవర్ కింద చిన్నపాటి గుడారాలు ఏర్పాటు చేసుకొని నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా మంగళవారం 205 మీటర్ల పొడవునా ఫ్లైఓవర్ స్లాబ్ నిర్మించేందుకు కార్మికులు సెంట్రింగ్ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకున్నారు. రాత్రి సమయంలో స్లాబ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున సుమారు 3:10 గంటల సమయంలో దురదృష్టవశాత్తు స్లాబ్ నిర్మాణానికి సపోర్టుగా ఏర్పాటు చేసిన కొన్ని ఇనుప రాడ్లు భూమిలోకి కృంగిపోవడంతో స్లాబ్ ఒక్కసారిగా కూలింది. దీంతో స్లాబ్ నిర్మాణ పనుల్లో ఉన్న పునీత్, శంకర్లాల్, జితేందర్ కుమార్, గోపాలకృష్ణ, రత్నేశ్కుమార్, కమల్ ప్రకాశ్, రవికుమార్, హరిరాం కుమార్, రోహిత్కుమార్ స్లాబ్తో పాటు కిందపడిపోవడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి.
అక్కడే ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీ సూపర్ వైజింగ్ అధికారి గోపాలకృష్ణ ఈ సమాచారాన్ని వెంటనే మేనేజ్మెంట్కు తెలిపాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ హాస్పిటల్కు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రమాదానికి గురై హాస్పిటలో చేరిన బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు వెంటనే బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలందించి, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. సంఘటన స్థలాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఎల్బీనగర్ డివిజినల్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఎల్బీనగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి పరిశీలించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేపడుతామని డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.
సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు బుధవారం సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖానలో పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్న మంత్రి కేటీఆర్ క్షతగాత్రులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, ప్రమాదంపై పురపాలక శాఖ పూర్తి స్థాయి విచారణ చేపడుతుందన్నారు. జీహెచ్ఎంసీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీకి అదనంగా జేఎన్టీయూ ఆధ్వర్యంలో విచారణ చేయిస్తామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి కేటీఆర్ వెంట నగర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్, ఇతర అధికారులు ఉన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా క్షతగాత్రులను పరామర్శించి భరోసా కల్పించారు.