సైదాబాద్, సెప్టెంబర్ 28: ప్రపంచానికి పాతబస్తీగా పరిచయం ఉన్న మలక్పేటకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) టవర్ రాకతో మహర్ధశ రానున్నది. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన మలక్పేట రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మలక్పేటలోని ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయంలో ఐటీ టవర్ ఏర్పాటు చేసి ఇక్కడి యువత జీవితాలను మారుస్తామని టీఐ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించినట్లుగానే త్వరలోనే ఐటీ టవర్ ఏర్పాటు కానుండటంతో ఇక్కడ సుమారు 10వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
మలక్పేట నియోజకవర్గం అక్బర్బాగ్ డివిజన్ పరిధి బి- బ్లాక్లోని ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయంలో రూ.1,032 కోట్ల వ్యయంతో ఐటీ టవర్ను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పది ఎకరాల విస్తీర్ణంలో 21 అంతస్తులతో 20లక్షల చదరపు అడుగుల్లో భారీస్థాయిలో ఐటీ టవర్ను నిర్మించేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు, అనుమతులను మంజూరు చేసింది. టీఎస్ఐఐసీతో పాటు ఇతర సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించే టవర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తికావటంతో శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే 44.20 ఎకరాల్లో నిర్మించాల్సి ఉండగా తొలి విడతలో 10.35 ఎకరాల్లో నిర్మించనున్నారు.
పాతబస్తీలో ఐటీ టవర్ ఏర్పాటు కోసం మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఎంతోగాను శ్రమించారు. ఎన్నికల సమయంలో నియోజక వర్గం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఐటీ టవర్ ఏర్పాటులో సఫలీకృతులయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తోపాటు టీఎస్ఐఐసీ అధికారులు, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్తో తరుచుగా చర్చలు జరిపి ఎట్టకేలకు ఐటీ టవర్ తీసుకువచ్చారు.
మలక్పేటలో నిర్మించ తలపెట్టిన ఐటీ టవర్ నిర్మాణ పనులకు త్వరలోనే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల తెలిపారు. మంత్రి కేటీఆర్తోపాటు రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఐటీ శాఖ అధికారులు తదితరులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.