Minister KTR | తెలంగాణ ప్రభుత్వం నింపిన స్ఫూర్తితో చెరువుల పరిరక్షణకు పలు కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చాయి. సీఎస్ఆర్ ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) నిధులతో జీహెచ్ఎంసీ పరిధిలోని 25, హెచ్ఎండీఏ పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా క్రెడాయి ప్రెసిడెంట్ రామకృష్ణారావు, నరెడ్కో ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి మాట్లాడారు. వాళ్ల తర్వాత రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. తన ప్రసంగం మొదలుపెట్టగానే ముందుగా.. రామకృష్ణారావు, సునీల్ రెడ్డికి మంత్రి కేటీఆర్ ఓ కండీషన్ పెట్టారు. తర్వాత మీటింగ్లో కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలని సూచించారు.
తెలుగు వాళ్లు తెలుగులో మాట్లాడకపోతే మన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ తెలుగులో మాట్లాడే పరిస్థితి ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ముందే తెలుగు తక్కువ అవుతుందని అంటున్నారని గుర్తు చేశారు. రాను రాను తెలుగోళ్లు కూడా తెలుగులో మాట్లాడకపోతే ఎవరికీ మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దయచేసి నెక్ట్స్ టైమ్ అయినా మొత్తం సావధానంగా, తెలుగులో సాకల్యంగా మాట్లాడే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చారు.