సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) ;రేయింబవళ్ల శ్రమ.. అనుక్షణం పర్యవేక్షణ.. అంతకుమించి లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పం.. వెరసి.. రాష్ట్ర ఐటీ రంగం అందనంత వేగంగా దూసుకుపోతున్నది. తెలంగాణ ప్రభుత్వ నిర్విరామ కృషితో విప్లవాత్మకమైన ప్రగతి సాధిస్తున్నది. తొమ్మిదేండ్లలో ఈ రంగంలో కొత్తగా 5,82,319 ఉద్యోగాలు లభించడం విశేషం. ఇక 2022 -23 సంవత్సరంలోనూ ఐటీ రంగం 31.44 శాతం వృద్ధిని సాధించింది. స్టార్టప్లకూ నగరం స్వర్గధామంగా మారింది. 2016లో 400 స్టార్టప్లతో ఉన్న టీ హబ్ ప్రస్తుతం 2500లకు విస్తరించింది. సోమవారం టీ-హబ్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 2022-23 ఐటీ వార్షిక నివేదికను విడుదల చేశారు. కేవలం తొమ్మిదేండ్లలో రూ. 57వేల కోట్ల నుంచి రూ.2.41 కోట్ల ఎగుమతులకు చేరుకున్నామని మంత్రి వెల్లడించారు. ఐటీ రంగం తర్వాత రాష్ర్టానికి ఎలక్ట్రానిక్ రంగంలోనూ భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ‘ఈ రంగంలో రూ.38వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాగా, వాటి ద్వారా 31వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చాయి’ అని పేర్కొన్నారు.
ఒక్క ఉద్యోగం కల్పించాలన్నా… రూపాయి పెట్టుబడిని తీసుకురావాలన్నా… మాటలు చెబితే కుదరదు! దాని వెనక రేయింబవళ్ల శ్రమ జరగాలి. అనుక్షణం పర్యవేక్షణ కావాలి. అంతకుమించి లక్ష్యాన్ని సాధించాలనే సంకల్ప ఉండాలి. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి.. ఆశ్చర్యకరమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఐటీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఇదే అద్భుతాన్ని చేసి చూపించింది. పదహారేళ్ల హైదరాబాద్ ఐటీ రంగ ప్రస్థానంలో మూడు లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉంటే.. అదే గడిచిన తొమ్మిదేళ్లలో ఆ సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. ఐటీ రంగ ఎగుమతులు వేలల్లో ఉంటే ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల అసాధ్య లక్ష్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ తొమ్మిది సంవత్సరాల్లో నేల మీద నెమ్మదిగా ఎదుగుతున్న ఐటీ రంగాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది. ఐటీ రంగ పెట్టుబడులకు తెలంగాణను స్వర్గదామంలా మార్చి.. స్టార్టప్లకు హైదరాబాద్ను రాజధానిగా చేసింది. అందుకే సోమవారం టీ-హబ్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన తెలంగాణ ఐటీ రంగ ప్రగతి నివేదిక-2022-23 అద్భుతాల సమాహారంగా కనిపిస్తుంది.
ఐదేళ్లకోసారి ఐటీ పాలసీ..
ఐటీ రంగం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) పాలసీ 2016-21 తీసుకురాగా.. టెక్నాలజీల్లో వస్తున్న మార్పులను పరిగణలోకి తీసుకుంటూ కొత్తగా ఐటీ రంగం అభివృద్ధి కోసం మళ్లీ ఐదేళ్లకు 2021-26 పేరుతో రెండోసారి ఐసీటీ పాలసీని తీసుకువచ్చింది. దీంతో కొత్తగా డేటా సెంటర్ల ఏర్పాటు, ఓపెన్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి టెక్నాలజీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఐటీ పాలసీకి తోడు హైదరాబాద్ నగరానికి ఉన్న అనుకూలతలే ఐటీ రంగంలో రెట్టింపు స్థాయిలో ఎగుమతులు, ఉద్యోగావకాశాలను కల్పించడం సాధ్యమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2వ ఐటీ పాలసీ ఐటీ రంగాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకుపోవడంతో పాటు నగరానికి మరిన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చేలా దోహదం చేస్తుందని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి నేర్పిన అనుభవంతో డిజిటలైజేషన్కు చాలా ప్రాధాన్యత పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) ద్వారా ఎన్నో పరిష్కారాలు చూపే ప్రాజెక్టులను రూపొందించి విజయవంతంగా అమలు చేయడానికి పాలసీలు దోహదం చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా డిజిటల్లీ ఎంపర్డ్ సిటిజన్స్, డిజిటల్ గవర్నమెంట్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఐసీటీ యాజ్ ఆన్ ఇండస్ట్రీ, ఐసీటీ ఫర్ డెవలప్మెంట్ వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి.
జిల్లా కేంద్రాల్లో ఐటీ కంపెనీలు
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ ఆదాయంపైనే దృష్టి పెట్టి పాలన కొనసాగింది. కానీ స్వరాష్ట్రంలో హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నది. ఇందులో రాష్ట్రంలోని టైర్ – 2, టైర్ -3 నగరాల్లోనూ ఐటీ రంగాన్ని విస్తరించి స్థానికంగానే ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా ప్రణాళికలను అమలు చేస్తున్నది. దీంతో హైదరాబాద్ దాటి ఐటీ, ఐటీయేతర రంగాలు విస్తరిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థికాభివృద్ధితోపాటు గ్రామ స్థాయి వరకు ఐటీ ఫలాలను అందించడమే లక్ష్యంగా సేవలను విస్తరించింది. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సిద్దిపేట, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లు, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ఐదు నగరాల్లో టవర్లు అందుబాటులోకి రావడంతోపాటు మరిన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. 5శాతం ఐటీ ఎగుమతులను ఆయా నగరాలకు విస్తరించేలా 25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సెకండ్ ఐసీటీ పాలసీని తీసుకురానున్నది. వీటితోపాటు ఇన్ హౌజ్ టీ హబ్, టాస్క్, వీ హబ్ రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండలో ఐటీ, ఐటీఈఎస్ రంగాల విస్తరణ కోసం పలు అంతర్జాతీయ సంస్థలతో ఐటీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
టీ ఫైబర్తో సామాన్యులకు సైతం..
అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు సైతం అందించేందుకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ శాఖ పెద్ద ఎత్తున కల్పిస్తున్నది. ఇందులో భాగంగా టీ-ఫైబర్ ప్రాజెక్టును చేపట్టింది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సైతం వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందేలా ఐటీ శాఖ కృషి చేస్తున్నది. టీ ఫైబర్ ద్వారా ప్రజలు డిజిటల్ సేవలు చాలా సులభంగా, సత్వరమే పొందవచ్చు.
పారిశ్రామిక రంగంలో దూసుకుపోయేలా..
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి అనూహ్య రీతిలో స్పందన రావడం, ఆంత్రప్రెన్యూర్షిప్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఉత్సాహం చూపుతున్న యువతకు దిశానిర్ధేశం చేసి స్టార్టప్ రంగాల్లో దూసుకుపోయేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీనికోసం టీ ఏంజెల్, కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలను చేపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో స్టార్టప్లకు దిక్చూచిగా మారిన టీహబ్కు ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నది. ఇందులో బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా-2022, నేషనల్ టెక్నాలజీ అవార్డుతోపాటు, బెల్జియం, అమెరికా, స్వీడన్, యూకే వంటి ఎన్నో దేశాల ప్రతినిధుల ప్రశంసలను అందుకుని ఇన్నోవేషన్ రంగానికి చిరునామాగా మారింది. దీంతో స్టార్టప్ రంగంలో ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మహిళా సాధికారిత, ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ షిప్ను పెంచడమే లక్ష్యంగా 2017లో తీసుకువచ్చిన వీ హబ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనతి కాలంలోనే 21 స్టార్టప్ కార్యక్రమాలు, 5288 మహిళా ఆంత్రప్రెన్యూర్లతో 2823 ఉద్యోగాలను కల్పించే స్థాయికి వీ హబ్ ఎదిగింది. ప్రీ ఇంక్యుబేషన్, ఓపెన్ హౌజ్, గర్ల్స్ ఇన్ స్టెమ్, వీ ఆల్ఫా, గిజ్, ట్రైకార్, లాంచ్ ప్యాడ్, ప్రాజెక్ట్ ఉజ్గార్, పీడబ్ల్యూడీ ఉమెన్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ నారీ శక్తికి సహకరిస్తున్నది.
దేశంలోనే తొలిసారిగా.. ఈ మోటార్ షో
2016లో తీసుకువచ్చిన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్స్ పాలసీ పెట్టుబడులకు గేట్ వేగా మారింది. దీని ద్వారా ఇప్పటివరకు రూ. 50వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. గతేడాదిలోనే ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో ఏకంగా రూ.38వేల కోట్ల పెట్టుబడులు 32వేల మందికి ఉపాధినిచ్చేలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఈవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ ఈ మోటార్ షోను దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతిని దక్కించుకున్నది. ఈ మొబిలిటీ వీక్ పేరిట ఈవీ రేస్ను ప్రారంభించింది. దీంతోపాటు డిజైనింగ్, మానుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డీ యూనిట్లతోపాటు సప్లయ్ చైన్ వంటి రంగాల్లో కంపెనీలకు ప్రభుత్వం సహకరిస్తున్నది.
ఆవిష్కరణలకు పెద్దపీట..
ఓవైపు దేశ, విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తూనే.. మరోవైపు వినూత్న ఆవిష్కరణలు, ఆంత్రప్రెన్యూర్షిప్ను పెంచడమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో ప్రధానమైన టీ హబ్, వీ హబ్, టీఎస్ఐసీ, టీ వర్క్స్, టాస్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇమేజ్ సీఓఈ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నది. 2015లో టీ హబ్ అందుబాటులోకి రాగా, ఏడేళ్లలో మరో దశకు చేరుకుని టీ హబ్ 2.0ను కూడా ఆవిష్కరించింది. స్టార్టప్ రంగానికి బూస్టప్నిస్తూ రూ.8.5 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నది. దీంతోపాటు ఎంతో మందికి ఉపాధినిస్తూ, మరెన్నో స్టార్టప్ కంపెనీలకు ఆవాసం కల్పిస్తూ ఆంత్రప్రెన్యూర్షిప్కు ఊతమిస్తున్నది. అదేవిధంగా స్టేట్ ఇన్నోవేషన్ సెల్ను ప్రారంభించి విద్యార్థి దశలోనే ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు తోడ్పడుతున్నది. గ్రామీణ స్థాయిలో యువ పారిశ్రామికవేత్తలు, ఇన్నోవేటర్లను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపడుతున్నది. ఇంటింటా ఇన్నోవేటర్, ఇన్నోవేషన్ టూ ఆంత్రప్రెన్యూర్ షిప్, సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్ సమిట్, గవర్నమెంట్ సెన్సిటైజేషన్ వర్క్షాప్, సోషల్ ఆంత్రప్రెన్యూర్ షిప్ సమిట్తో కృషి చేస్తున్నది. మల్టీమీడియాలో విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకునేలా ఇమేజ్ పాలసీని తీసుకువచ్చిన ప్రభుత్వం దేశంలోనే తొలి మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పాలసీని రూపొందించింది. దీని ద్వారా దేశంలో హైదరాబాద్ నగరాన్ని యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్లో హబ్గా తీర్చిదిద్దేందుకు ఎస్టీపీఐతో కలిసి కృషి చేస్తున్నది.
స్టార్టప్ను ప్రోత్సహించేలా వినూత్న కార్యక్రమాలు..
2016లో 400 స్టార్టప్లతో ఉన్న టీ హబ్ ప్రస్తుతం ప్రస్తుతం 2500 స్టార్టప్లకు విస్తరించింది. స్టార్టప్లకు అండగా నిలుస్తూ వినూత్న కార్యక్రమాలతో ఊతమిస్తున్నది. సుస్థిరమైన స్టార్టప్లను నెలకొల్పేందుకు ల్యాబ్ 32 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు అవసరమైన సేవలను ఈ కార్యక్రమం ద్వారా అందించనుండగా 800 దరఖాస్తులు వస్తే 14 స్టార్టప్లను ఎంపిక చేసింది. బిగ్ లీప్ ప్రొగ్రాం, రుబ్రిక్స్ కార్యక్రమాలతో స్టార్టప్లకు అవసరమైన ఫండింగ్, మెటరింగ్, ప్రొడక్ట్ మార్కెటింగ్కు అవసరమైన సేవలను అందించి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
పౌర సేవల్లో పెను మార్పులు
డిజిటల్ విప్లవంతో రాష్ట్రంలో అందిస్తున్న పౌర సేవల్లో వినూత్న మార్పులు వచ్చాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం (ఐటీ-ఈసీ) పేర్కొన్నది. 2022-2023 వార్షిక నివేదికను సోమవారం విడుదల చేసింది. ఇందులో పలు అంశాల్లో పురోగతిని, సాధించిన విజయాలను వెల్లడించింది. ప్రభుత్వంతో డిజిటల్ పరస్పర కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి సరైన మెకానిజాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక అంశాల్లో అప్డేట్ అవుతూ ముందుకుసాగుతున్నది. డిజిటల్ రంగంలో సురక్షితమైన సేవలతోపాటు డేటా ప్రాసెసింగ్ను ప్రారంభించింది. ప్రతియేటా 2.4కోట్ల మందికి 430 రకాల పౌరసేవలు అందిస్తుండగా, రూ.6870కోట్ల లావాదేవీలు మీ-సేవల ద్వారా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4500 మీ-సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది.
ఆలోచనలకు నమూనా రూపం..
వరల్డ్ క్లాస్ ఫ్రొటో టైపింగ్ ఫెసిలిటీ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. టీ వర్క్స్ పేరిట ఆలోచనలకు నమూనా రూపం తీసుకువచ్చేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా ఎన్నో మైలురాళ్లను తెలంగాణ ప్రభుత్వం అధిగమించింది. ఇప్పటివరకు 300కు పైగా స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు టీ వర్క్స్ సేవలను వినియోగించుకోగా, 1000కి పైగా విడి భాగాల నమూనాలను ఆవిష్కరించింది. దీంతోపాటు 30 ఉత్పత్తులను ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అందించి ఫాక్స్కాన్, క్వాల్కామ్, వసంత టూల్స్, వంటి కంపెనీలతో కీలక ఒప్పందాలను చేసుకున్నది. వచ్చే ఏడాది కాలంలో రూ.100 కోట్ల విలువ కలిగిన విడిభాగాలను అందించడమే లక్ష్యంగా దూసుకుపోతుంది. అంతరిక్షయానంలో తొలి స్టార్టప్గా స్కై రూట్ ఇక్కడి నుంచి మొదలు కాగా ఎయిర్బోర్నక్ష మెడికల్ ర్యాపిడ్ ట్రాన్స్ఫోర్టు, పరిశోధనలకు అవసరమైన 3డీ ప్రింటెండ్ నమూనాలు, మెడికల్ డ్రోన్ పేలోడ్, మారుతి డ్రోన్స్, చార్ట్ టెక్నో, మెకానికల్ వెంటిలేటర్ వంటి ఫ్రొటోటైప్ ఉత్పత్తులను టీ వర్క్స్ అందించింది.
ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్..
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో లీడర్గా ఉండడంతో పాటు వాటి అవసరం ఎక్కడ ఉంటుందో గుర్తించి, వినియోగించుకోవడమే లక్ష్యంగా చేసుకొని తెలంగాణ ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మూస పద్ధతిలో కాకుండా అందుబాటులో ఉన్న టెక్నాలజీలతో అందించేందుకు అవసరమైన ఫ్రేమ్ వర్క్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే ఎమర్జింగ్ టెక్నాలజీస్ల కింద 8 కీలక టెక్నాలజీస్లను గుర్తించారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్. డ్రోన్ టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్పేస్ టెక్ వంటివి ఉన్నాయి.
డిజటల్ మీడియా వింగ్లో ముందంజ..
ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండడంలో తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ (టీడబ్ల్యుఎండబ్ల్యు) కీలకపాత్ర పోశిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్, గూగుల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ను పటిష్టం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే సీఎంవో ట్విట్టర్ అకౌంట్స్ను ఫాలోఅవుతున్న టాప్ స్టేట్లతో పోటీపడి తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలంగాణ సీఎంవో ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్ 15,52,216 మంది ఉన్నారు. దీనిద్వారా 3.50కోట్ల మంది చేరువయ్యారు.
ఉద్యోగ అవకాశాలకు కేరాఫ్గా తెలంగాణ
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్య, విజ్ఞానం, నైపుణ్య శిక్షణ అందరికీ చేరవేయాలన్న లక్ష్యంతో రూపొందించబడిన ప్రభుత్వ రంగ బహుళ మాధ్యమ టెలివిజన్ నెట్వర్క్ టి-సాట్ దేశానికే మార్గదర్శిగా నిలిచింది. విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందించే లక్ష్యంతో విద్య, ఉద్యోగం, వైద్యం, మహిళలు, వ్యవసాయం తదితర ప్రాధాన్యత కలిగిన సామాజిక అంశాలతోపాటు ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యంతో యువతను సన్నద్ధం చేస్తున్నది. ప్రస్తుతం టీ-సాట్కు 16.73కోట్ల వ్యూస్ ఉండగా.. 42.8లక్షల మంది యూజర్స్ ఉన్నారు. తెలంగాణ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సాంకేతిక పరిజ్ఞానంతో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగపరంగా ఉపాధి చూపుతున్నది. ప్రభుత్వ కళాశాలల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్లిక్ టు లెర్న్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.