హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలోని పీపుల్స్ ప్లాజా వద్ద చెత్త తరలించే 40 అత్యాధునిక వాహనాలను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ నగరంలో అయినా రెండు ముఖ్యమైన వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ ఉంటాయి. స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ మేనేజ్మెంట్కు పరిష్కారాలు వెతుకుతూ వస్తున్నాం. 2014లో 2500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తే.. ప్రస్తుతం 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నాం. 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోలను చెత్త సేకరణకు ఉపయోగిస్తున్నాం. త్వరలోనే మరో 400 ఆటోలు నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. 150 డివిజన్లలో డోర్ టు డోర్ కలెక్షన్కు వినియోగిస్తామన్నారు.
విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలంటే ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి దుర్గంధం వెదజల్లకుండా చర్యలు తీసుకోవాలి. 95 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నాం. మొబైల్ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్ను పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అత్యాధునికమైన సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో అత్యాధునిక పద్ధతులను అవలంభిస్తున్నాం. లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ కోసం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువుల్లో చెత్త, గుర్రపు డెక్కను తరలించేందుకు వాహనాలను వినియోగిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా పని చేయాలి అని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.