KTR | హైదరాబాద్ : నగరంలో మరో అత్యాధునిక వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది. బేగంపేట ధనియాల గుట్టలోని శ్యామ్లాల్ బిల్డింగ్ వద్ద 4 ఎకరాల్లో రూ. 8.54 కోట్లతో నిర్మించిన ‘మహాపరినిర్వాణ’ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు స్థానిక కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
మోడ్రన్ వైకుంఠధామంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణం, సెరిమోనియల్ హాల్, చెక్క నిల్వ గది, పిండ ప్రదానం చేసే ప్రాంతం, వెయిటింగ్ హాల్, బాడీ ప్లాట్ఫారంలు, ఫీచర్ గోడలు, ప్రవేశం, నిష్క్రమణకు తోరణాలు, ఫలహారశాల, నీటి వసతి సహా టాయిలెట్ బ్లాక్ల ఏర్పాటు, పాదచారుల మార్గం అభివృద్ధి, పార్కింగ్, వైఫై సౌకర్యం, సీఎస్ఆర్ పద్ధతిన శివుని విగ్రహ ఏర్పాటు, రెండు అంతిమ యాత్ర వాహనాలు వంటి అన్ని రకాల సౌకార్యలు కల్పించారు.
నిన్నటివరకు అక్కడ ఉన్న శ్మశాన వాటిక సమస్యలకు కేంద్రంగా ఉండేది. ముఖ్యంగా అంత్యక్రియలు చేసే వారు, అందులో పాల్గొనేందుకు వచ్చే వారికి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ముఖచిత్రం మారింది. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఫ్లైఓవర్లు, పార్కులు ఇలాంటి సదుపాయాలే కాదు… అత్యంత కీలకమైన చివరి మజిలీ ప్రాంగణాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నది. మృతుడి బంధువులకు సకల సౌకర్యాలు ఉండటంతో పాటు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లతో మోడ్రన్ వైకుంఠధామాలను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా బేగంపేటలోని ధనియాల గుట్టలో రూ.8.54 కోట్లతో నిర్మించిన ‘మహా పరినిర్వాన (వైకుంఠధామం)’ విశ్వనగర మౌలిక వసతుల స్థాయికి అద్దం పడుతుంది.