సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): మూసీ ఆక్రమణలను తొలగించి డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మూసీ నదిలో నివాసముంటున్న పేద ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల రూపంలో గొప్ప ఉపశమనం లభిస్తుందని అన్నారు. దీంతో పాటు మూసీ నది వరద నివారణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు ఆక్రమణల బెడద కూడా తగ్గుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేల సమావేశం గురువారం జరిగింది. నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వరద నివారణకు ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీ కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చిందని ఎమ్మెల్యేలంతా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎస్ఎన్డీపీతో పాటు మూసీనదిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలకు అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారిని అభినందించారు.
ప్రజల్లోకి వెళ్లండి.. చేసిన పనులు తెలుపండి
మూసీ అడ్డంకులు తొలగిన తర్వాత మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుడుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాథమిక ప్లానింగ్ పూర్తి చేసిందన్నారు. ఎస్ఎన్డీపీ రెండో దశ కార్యక్రమానికి సంబంధించిన పనులను త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు. నగరంలో వాన నీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చే వారంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభిస్తుందని చెప్పారు. సంబంధిత నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకు ఇల్లు అందజేస్తామన్నారు. నగరంలో గత పదేండ్లలో జరిగిన విస్తృతమైన అభివృద్ధి పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారన్న నివేదికలు తమకు ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచించారు.