సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉంటున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు నిలోఫర్ కేఫ్లో సందడి చేశారు. ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా నిలోఫర్ కేఫ్కు వచ్చిన మంత్రి కేటీఆర్ అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. కేఫ్లో చాయ్ తాగుతున్న పలు కుటుంబాలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి కేటీఆర్పై, ప్రధానంగా హైదరాబాద్ అభివృద్ధిపైన ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్లో ఉన్న శాంతి భద్రతలు, అభివృద్ధి అద్భుతంగా ఉన్నాయన్నారు. బెంగళూరులో పనిచేస్తున్న యువకుడి కుటుంబంతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బెంగళూరు నుంచి తన కుటుంబంతో గడిపేందుకు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ నగరం వినూత్నంగా కనిపిస్తున్నదని, ప్రధానంగా గత పదేండ్లలో నగరం అద్భుతంగా మార్పు చెందిందని చెప్పారు. దశాబ్దాల క్రితం వారణాసి నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన తమకు నగరంలో వచ్చిన మార్పు సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్లో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి జీవించే వాతావరణాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత పలువురు మహిళలతో మంత్రి కేటీఆర్ సంభాషించారు. తన కొడుకుకు కేటీఆర్ అంటే ప్రత్యేక అభిమానమని ఓ మహిళ తెలిపారు. మహిళలతో సంభాషిస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ వారి కుటుంబ నేపథ్యం ప్రభుత్వ పనితీరు పట్ల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత మైనార్టీ కుటుంబంతో ముచ్ఛటించిన కేటీఆర్.. వారి నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరం అద్భుతంగా ఉన్నదన్నారు. ప్రధానంగా మత ఘర్షణలు లేకుండా అందరికీ అన్ని అవకాశాలు అందిస్తున్న తీరు పట్ల మైనార్టీ కుటుంబం ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేసింది. మంత్రి కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలాగా చాయ్ తాగుతూ పలువురితో సంభాషించడం చాలా మందిని ఆకట్టుకున్నది. కేటీఆర్తో పలువురు సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు.