వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని, నాగోల్- ఎల్బీనగర్ మధ్య ఉన్న 5 కిలోమీటర్ల మెట్రో లింకును కూడా పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు నిర్మించిన బాక్స్ డ్రైన్, ఫతుల్లాగూడ నుంచి నిర్మితమైన పీర్జాదిగూడ లింక్ రోడ్డు, ముక్తిఘాట్, పెంపుడు జంతువుల శ్మశాన వాటికలను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. వరద ముంపు బాధలను తప్పించే ఎస్ఎన్డీపీ మొదటి దశ పనులన్నీ రాబోయే ఎండాకాలం కల్లా పూర్తవుతాయని తెలిపారు. రహదారుల విస్తరణ కోసం ఉద్దేశించిన ఎస్సార్డీపీ పనులు శరవేగంగా సాగుతున్నాయని, మూసీపై 14 వంతెనలను నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్కుమార్, వాణీదేవి, బొగ్గారపు దయానంద్, శంభీపూర్ రాజు, కార్పొరేషన్ చైర్మన్లు వై.సతీశ్రెడ్డి, శ్రీనివాస్గుప్తా, లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ పాల్గొన్నారు.
దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్కు వచ్చి స్థిర పడుతున్నారు. కొత్తగా ఐటీ, పరిశ్రమలు వస్తున్నాయి. నగర విస్తరణకు తగినట్లుగా సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించకపోతే బెంగళూరు లాగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రోడ్ల కోసం ఎస్ఆర్డీపీ, నాలాల కోసం ఎస్ఎన్డీపీ అమలు చేస్తున్నాం. రూ.985 కోట్లతో చేపట్టిన ఎస్ఎన్డీపీ పథకంలో భాగంగా 34 పనులకు గాను ఇప్పటికే 2 పూర్తయ్యాయి. నెలాఖరు కల్లా మరో 17, జనవరి చివరి కల్లా 15 పనులను పూర్తి చేస్తాం. హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలా, బుల్కాపూర్ నాలా పనులు వచ్చే ఎండాకాలంలోగా పూర్తవుతాయి.
తెలంగాణ రాకముందు ఎల్బీనగర్ చౌరస్తా ఎట్ల ఉండె? ఇప్పుడు ఎట్లుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఎల్బీనగర్ జంక్షన్ ఒక్కటి చాలు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల వారికి వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఒకే చోట శ్మశానవాటిక ఏర్పాటు చేయడం, పెంపుడు జంతువుల కోసం కూడా దహనవాటిక నిర్మించడం దేశంలోనే ప్రప్రథమం. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలి.
సిటీబ్యూరో/మన్సూరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి స్థిరపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలే కాకుండా భారతదేశంలోని 28 రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరం విస్తరిస్తున్న పద్ధతుల్లో మౌలిక వసతులు పెరగకపోతే బెంగళూరులా వెనుకబడిపోతామని చెప్పారు. ప్రధానంగా ప్రజారవాణాను విస్తరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మొదటి దశలో చేపట్టిన మెట్రో నాగోల్ వరకు పూర్తి చేశామని, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మిగిలిపోయిన 5 కిలోమీటర్ల మెట్రోను రెండో దశలో చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని ప్రకటించారు. ఎస్ఎన్డీపీ ద్వారా నాలాల అభివృద్ధి, రవాణా సౌకర్యం కోసం ఎస్ఆర్డీపీ పథకాలు, రోడ్ల నిర్వహణకు సీఆర్ఎంపీ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణాకు కూడా పెద్ద పీట వేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎస్ఎన్డీపీతో నాలాల విస్తరణ
ఎస్ఎన్డీపీ కింద నగరం నలుమూలలా ఉండే నాలాల సమస్యలను పరిషరించేందుకు ఎస్ఎన్డీపీ రెండో దశ పనులు చేపడుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఫతుల్లాగూడ నుంచి పీర్జాదిగూడ వరకు చేపట్టిన రోడ్డును రూ.34 కోట్లతో హైదరాబాద్ నేషనల్ హైవేకు, ఓఆర్ఆర్కు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. మూసీ నదిపై రూ.52 కోట్లతో వంతెనను నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీంతో వరంగల్ వెళ్లేందుకు మార్గం సులభతరం అవుతుందని అన్నారు. మూసీపై కొత్తగా జీహెచ్ఎంసీ ద్వారా 14 వంతెనలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఆటోనగర్లోని ఖాళీ స్థలంలో ప్లవర్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ కుమార్, సురభి వాణీదేవి, బుగ్గారపు దయానంద్, శంభీపూర్ రాజు, నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్లు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్కో చైర్మన్ వై.సతీష్రెడ్డి , టీఎస్ఐడీసీ చైర్మన్ అమరావతి లక్ష్మీనారాయణ, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సినీ నటి అమల, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఈఎన్సీ జియాఉద్దిన్, జోనల్ కమిషనర్ పంకజ, నాగోల్ కార్పొరేటర్ అరుణ, హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ సుజాత నాయక్, వివిధ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్రెడ్డి, వజీర్, ప్రకాశ్ గౌడ్, జిట్టా రాజశేఖర్రెడ్డి, జీవీ సాగర్రెడ్డి, రమావత్ పద్మానాయక్, చెరుకు సంగీత, సామ రమణారెడ్డి, జిన్నారం విఠల్రెడ్డి, భవానీ ప్రవీణ్కుమార్, సామ తిరుమల్ రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
రూ.55 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
దృష్టశక్తులను ఎదుర్కొనే శక్తి సీఎంకు ఉంది
రాష్ట్రంలోని 12,700 గ్రామాల్లో హరితహారం ద్వారా మొకలు నాటడమే కాకుండా.., ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠ దామాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 8 ఏండ్ల ముందు హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు లేవని ఇప్పుడు వాటి ఏర్పాటుతో ప్రజా రవాణావ్యవస్థ సాఫీగా సాగుతున్నదని చెప్పారు. భారతదేశంలో ఎకడాలేని విధంగా హైదరాబాద్ నగరం నలువైపులా అభివృద్ధి చెందుతున్నదని, ఈ అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు జెలసీగా ఫీలవుతున్నాయని తెలిపారు. కొన్ని దృష్ట శక్తులు ఇబ్బందులకు గురిచేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురొని నిలబడ్డారని చెప్పారు.
ఫతుల్లాగూడలో నిర్మించిన శ్మశానవాటికను చూస్తుంటే.. శ్మశానవాటికకు వెళ్తున్నామా..? లేక ఫిలిం సిటీలోకి పోతున్నామా అనే సందేహం కలుగుతుందని అన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల కోసం అత్యాధునిక హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు మతాల కోసం ఒకే ప్రాంతంలో శ్మశానవాటికలను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం మంత్రి కేటీఆర్ అని కొనియాడారు. ఫతుల్లాగూడలో నిర్మించిన శ్మశానవాటికను చూస్తుంటే మా దగ్గర ఎందుకు ఇలాంటిది లేదు అనే జలసీ వస్తుందని.. మేడ్చల్లోనూ ఇలాంటి శ్మశానవాటికను నిర్మించాలని మంత్రి కేటీఆర్ను మంత్రి మల్లారెడ్డి కోరారు.
అభివృద్ధిలో బెంగళూరును అధిగమించిన హైదరాబాద్
మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిపోయాయని, అభివృద్ధిలో హైదరాబాద్ నగరం బెంగళూరును అధిగమించిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. బెంగళూరు నగరం తిరోగమన దిశగా ప్రయాణిస్తుంటే మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ఫతుల్లాగూడలో అత్యాధునిక హంగులతో ముస్లిం, క్రిస్టియన్లు, హిందువుల కోసం ఆరున్నర ఎకరాల స్థలంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ముక్తీఘాట్ను నిర్మించినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ముక్తీఘాట్ నిర్మాణం సాధ్యమైందని చెప్పారు. విదేశాల్లో ఉండే బంధువులు సైతం సెల్ఫోన్లలో అంత్యక్రియలను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
దేశంలో మరెకడా లేనివిధంగా పెంపుడు కుకల శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని అన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో ఎల్బీనగర్లో ట్రాఫిక్ సమస్యలు తీరిపోయాయని.. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద వందలాది కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మించామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఇటీవల కేంద్రం చేపట్టిన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో 7 శాతం పచ్చదనాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు. ఆటోనగర్ డంపింగ్ యార్డును ఒక అందమైన పూలవనంగా మార్చేందుకు ఒక వరం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ను ఆయన కోరారు. ఆటోనగర్ పారిశ్రామిక వాడలో కొందరు రసాయన వ్యర్థాలను వదులుతున్నారని దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లి వ్యర్థ రసాయనాల డంపింగ్ను అరికట్టాలని మంత్రి కేటీఆర్ను కోరారు.