వనస్థలిపురం, డిసెంబర్ 6 : వనస్థలిపురం ఫేజ్-4 కాలనీలో రూ.1.87లక్షలతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ను రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ప్రారంభించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులు, కాలనీవాసులతో కాసేపు మాట్లాడారు.
చెప్పడానికి సమస్యలు లేవు… కాలనీవాసులు
స్విమ్మింగ్పూల్ నిర్మించిన వనస్థలిపురం ఫేజ్-4 కాలనీవాసులతో మంత్రి కేటీఆర్ కాసేపు మాట్లాడారు. కాగా స్వయంగా మంత్రిని కలిసి మాట్లాడినా చెప్పడానికి తమ కాలనీలో ఎలాంటి సమస్యలు లేవని వారు పేర్కొన్నారు. తమకు ఇప్పటికే కమ్యూనిటీ హాల్ ఉందని, దానిపై సీనియర్ సిటిజన్ భవన్ నిర్మించాలని కోరారు. అనంతరం ఎఫ్సీఐ కాలనీవాసులకు పైనుంచి వచ్చే మురుగునీరు నిల్వ ఉంటుందని, దానితో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డికి బాధ్యత అప్పగించారు. రెండు పనులు పూర్తి చేసిన తర్వాత తనకు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. అనంతరం హస్తినాపురం మాజీ కార్పొరేటర్ గజ్జెల సుష్మ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జెల మధుసూదన్రెడ్డి నిర్మించిన జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే దయానంద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంటేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, ముద్దగౌని లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, లగ్గోని శ్రీధర్గౌడ్, మిట్టా రామ్మోహన్, సంజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.