KTR | హైదరాబాద్ : విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు మనం కూడా కొడుదామా..? షమీ హ్యాట్రిక్ తీసిండు.. మనం కూడా హ్యాట్రిక్ కొడుదామా..? వంద శాతం కొడుదామా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్కు మద్దతుగా ప్రసంగించారు.
కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ప్రచారానికి వస్తే క్రికెట్ ఆడండి. పిల్లలతో గల్లీలో జబర్దస్త్ క్రికెట్ ఆడించండి. కానీ ఓట్లు మాత్రం మాగంటి గోపీనాథ్కు వేయండి. కరోనా సమయంలో బయటకు రావడానికి మీరంతా భయపడ్డారు. కానీ గోపీనాథ్ గల్లీ గల్లీ తిరిగి పేదవారికి అండగా నిలబడ్డారు. రహ్మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ అలా ప్రతి డివిజన్లో, ప్రతి కాలనీలో సమస్యలు తెలిసిన వాడు మాగంటి గోపినాథ్ అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం కులం పేరుతో కుంపట్లు పెట్టలేదు. మతం పేరుతో మంటలు పెట్టలేదు. ప్రాంతం పేరుతో పంచాయితీ పెట్టలేదు. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ, బీహార్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక కేరళ ఎవరైనా కావొచ్చు.. హైదరాబాద్లో ఉన్నోళ్లంతా మావారే, మా బిడ్డలే అని చూసుకున్నాం. పదేండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి ఏందీ..? ప్రతి అపార్ట్మెంట్లో ఇన్వర్టర్లు, జనరేటర్లు, షాపుల్లో కరెంట్ ఉండేది కాదు. మళ్లీ ఆ దిక్కుమాలిన రోజులు కావాలా..? కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా..? ఆలోచించండి. పొరపాటున తప్పు చేస్తే ఆ పాత చీకటి రోజులు తిరిగి వస్తాయి. మళ్లీ కరెంట్ కోతలు, కంపెనీల మూతలు, మళ్లీ ఛార్జీల మోతలు తయారైతది అని కేటీఆర్ తెలిపారు.
ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణ ఉంది. మంచినీళ్లు వస్తున్నాయి. కరెంట్ మంచిగా చేసుకున్నాం. రోడ్లు మంచిగా ఉన్నాయి. డ్రైనేజీలను మంచిగా చేస్తాం. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వచ్చింది. 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్ వచ్చింది. ఇప్పుడు గెలిస్తే మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తున్నాం. మహిళలకు సౌభాగ్య లక్ష్మీ కింద నెలకు రూ. 3 వేలు మీ ఖాతాలో వేస్తాం. మతం, కులంతో సంబంధం లేకుండా ఈ పథకం అమలవుతది. ఆసరా పెన్షన్లు పొందుతున్న వారికి 5 వేలు రాబోతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి డిసెంబర్ 3 తర్వాత సన్నబియ్యం ఇస్తాం ఇది మా బాధ్యత. కేసీఆర్ బీమా పేరుతో 5 లక్షల జీవిత బీమా కూడా ప్రారంభించబోతున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కరెంట్ కష్టాలు లేవు.. కంపెనీలు వస్తున్నాయి. సంపద పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది. హైదరాబాద్లో కర్ఫ్యూ, కల్లోలాలు లేవు.. దీంతో కంపెనీలు వస్తున్నాయి. ఈ హైదరాబాద్ను కాంగ్రెసోళ్లకు అప్పజెప్తే.. మీకు తెలుసు, ఒక సీఎంను దించేతందుకు, ఇంకో సీఎం ఎక్కేతందుకు ఓల్డ్ సిటీలో మతకల్లోలాలు పెట్టి 400 మందిని చంపినోళ్లు కాంగ్రెసోళ్లు. అలాంటి దిక్కుమాలిన కాంగ్రెస్కు అవకాశం ఇవ్వొద్దు. ఆ దరిద్రాన్ని మళ్లీ మన నెత్తిమీదకు తెచ్చుకోవద్దు. బీజేపీ ఎప్పుడో ఎత్తిపోయింది. వాళ్ల పని అయిపోయింది అని కేటీఆర్ అన్నారు.