నగరవాసులను ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించి.. సులువైన ప్రయాణం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ఎస్ఆర్డీపీ సత్ఫలితాలిస్తున్నది. సిటీ రాస్తాపై ప్రగతి పరుగులు పెడుతున్నది. ఎస్ఆర్డీపీ పథకం మొదటిదశలో రూ. 8092 కోట్లతో చేపట్టిన47 ప్రాజెక్టుల్లో 33 దిగ్విజయంగా పూర్తి చేశారు. అనేక మార్గాల్లో నిర్మించిన ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్యూబీలు, లింకురోడ్లతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతున్నది. గతంలో గంటలు పట్టే ప్రయాణం..ఇప్పుడు నిమిషాల్లోనే..చేరుకోగలుగుతున్నారు. తాజాగా ఎస్ఆర్డీపీలో భాగంగా గచ్చిబౌలి వద్ద శిల్పా లేఅవుట్ వంతెనను శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్/శేరిలింగంపల్లి : ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ, లింకు రోడ్లతో నగర వాసులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. రేపటి అవసరాల కోసం మాస్టర్ ప్లాన్ తయారుచేసి జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలి వద్ద రూ.466 కోట్ల వ్యయంతో 2.81 కి.మీటర్ల పొడవుతో నిర్మించిన శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభివాణీదేవి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అలిపురం వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు హమీద్పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్గౌడ్, పూజిత జగదీశ్వర్గౌడ్, మంజులా రఘునాథ్రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయిబాబా, నీలం రవీందర్ ముదిరాజ్, చీఫ్ ఇంజినీర్ దేవానంద్, ఎస్ఈ వెంకటరమణ, డీఈ హరీశ్, తదితరులు పాల్గొన్నారు.
నగరం నలుదిక్కులా విస్తరిస్తున్నది: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ మహానగరం ఒకే ప్రాంతంలో కాకుండా నలుమూలలా విస్తరించడంతో పాటు అభివృద్ధి చెందుతున్నదని, ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతమంతా జీహెచ్ఎంసీలో కలిసే విధంగా కనిపిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. రోజురోజుకు పరిశ్రమ, ఐటీ రంగం విస్తరణ పెరగడంతో ఏడాదికి లక్ష కుటుంబాలు నగరంలో స్థిరపడుతున్నాయని, అందుకు అనుగుణంగా ఎంఎంటీఎస్, మెట్రో రైలు, ఆర్టీసీ విస్తరణకు పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని అన్నారు. ఎస్ఆర్డీపీ రెండో దశ భాగంగా రూ.3,500 కోట్లతో పలు అభివృద్ధి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
నగర రోడ్లపై వర్షం పడినా ఇబ్బంది కలుగకుండా సీఆర్ఎంపీ ద్వారా పలు అభివృద్ధి చేపట్టామని చెప్పారు. అదేవిధంగా ప్రధాన రోడ్లకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లింక్ రోడ్లను కూడా విస్తృతం చేశామని వివరించారు. రేపటి అవసరాల కోసం మాస్టర్ ప్లాన్ను తయారు చేసి జనాభాకు అనుకూలంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగూడ ఫ్లై ఓవర్ను డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలిపారు. గోపన్పల్లి ఫ్లై ఓవర్ను కూడా పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కోరుతామని చెప్పారు. అదేవిధంగా ఈ ఫ్లై ఓవర్కు అండర్ పాస్ నిర్మాణాన్ని రూ.20 కోట్లతో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
47 ప్రాజెక్టుల్లో 33 పూర్తి
హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలబెట్టాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించుకున్నాం. శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. మంచి నీళ్ల వ్యవస్థను బ్రహ్మాండంగా చేసుకున్నాం. రహదారులను కూడా బాగు చేసుకుంటున్నాం. నగర విస్తరణకు, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలన్న ఆలోచనతో ఎస్ఆర్డీపీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రూపొందించారు. 47 ప్రాజెక్టుల్లో శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్తో కలిపి ఆరేండ్లలో 33 ప్రాజెక్టులను పూర్తి చేశాం. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు లింక్ రోడ్లను అభివృద్ధి పరిచాం.ఎస్ఆర్డీపీ రెండో దశ రూ. 3,500 కోట్లతో చేపట్టనున్నాం.
– మంత్రి కేటీఆర్
మరిన్ని ఫ్లై ఓవర్లు : ఎమ్మెల్యే గాంధీ
ఔటర్ రింగ్రోడ్డుకు అనుసంధానం చేయడంతో పాటు గచ్చిబౌలి ప్రధాన జంక్షన్లో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారుల నిర్మాణం, అండర్పాస్లు, ఫ్లై ఓవర్లు, లింకురోడ్లు పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లిలో గంగారం హనుమాన్ దేవాలయం నుంచి అపర్ణ అపార్టుమెంట్స్ వరకు నూతన లింక్రోడ్డు, ఉషాముళ్లపూడి కమాన్ నుంచి గాజులరామారం వరకు 100 అడుగుల విస్తరణతో నూతన రహదారి, జేఎన్టీయూ నుంచి హెచ్ఎంటీ హిల్స్ మీదుగా ప్రగతినగర్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో త్వరలో పనులు ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ప్రపంచమంతా హైదరాబాద్నే చూస్తున్నది : ఎంపీ రంజిత్ రెడ్డి
కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకోవడం ఈరోజు మనం కళ్లారా చూస్తున్నామని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి లక్డికాపూల్ వరకు మెట్రోను విస్తరించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జీడీపీ వృద్ధి పెరిగిందని, ఆదాయ వనరులు కూడా పెరిగాయని చెప్పారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నందున దేశం, ప్రపంచం నగరం వైపు చూస్తున్నదని పేర్కొన్నారు.
త్వరలోనే 13 ఫ్లై ఓవర్లను పూర్తి చేస్తాం: మేయర్ విజయలక్ష్మి
రవాణా వ్యవస్థతో పాటు గ్రీనరి అభివృద్ధికి 10శాతం బడ్జెట్ను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన మిగతా 13 ఫ్లై ఓవర్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకు 17 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, బల్దియా అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.