జీహెచ్ఎంసీ సేవలను నగర పౌరులకు మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా అమలు చేస్తున్న వార్డుల నుంచే పాలనను అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేశ్తో కలిసి మంత్రి కేటీఆర్ కాచిగూడలో ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాగా, కుత్బుల్లాపూర్లో మంత్రి మల్లారెడ్డి, ఆజంపురాలో హోంమంత్రి మహమూద్ అలీ, పహాడీషరీఫ్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, అమీర్పేటలోని బీకేగూడలో మంత్రి తలసాని, సీఎస్ శాంతికుమారి, రామంతాపూర్లో మేయర్ విజయలక్ష్మి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వార్డు కార్యాలయాలను ప్రారంభించారు.
సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలువురికి పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అవార్డులను అందజేశారు. శుక్రవారం శిల్ప కళావేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేసి, వారిని ప్రత్యేకంగా అభినందించారు. అవార్డులను అందుకున్న వారిలో జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్కు చెందిన హోమ్ కంపోస్టింగ్ హౌస్ హోల్డ్ లెవల్ కేటగిరిలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు సుసైన్ అలెక్స్, బెస్ట్ బల్క్ వేస్ట్ జనరేటర్ కేటగిరిలో కృష్ణసింగ్, చార్మినార్ జోన్ పరిధిలో డై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ కేటగిరిలో శివ, కొండయ్య, భిక్షపతి, అదేవిధంగా ఎల్బీనగర్ జోన్ పరిధిలో కోఆపరేటివ్ బ్యాంకు కాలనీకి చెందిన శరత్ రెడ్డి, ఖైరతాబాద్ జోన్లో బెస్ట్ పబ్లిక్ టాయిలెట్ కేటగిరిలో సఫాయి కర్మచారి సంస్థకు చెందిన అమిత్కు మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి అవార్డులను అందజేశారు. అదేవిధంగా విధుల్లో మంచి పనితీరు కనబర్చిన మరో 21 మందికకి అవార్డులను అందజేశారు.
ఈ జాబితాలో టి.విజయ్ కుమార్ (చీఫ్ ఫైనాన్సియల్ అడ్వైజర్), జి.ఎన్.సాయిరాం (అసిస్టింట్ ఇంజినీర్), ఎస్.మహబూబ్పాషా( జాయింట్ కమిషనర్ స్పోర్ట్స్ అండ్ ఎస్టేట్ ఆఫీసర్), ఎం.షౌకత్ (స్టేషన్ ఫైర్ ఆఫీసర్), సీహెచ్.శిరీష (అసిస్టెంట్ సిటీ ప్లాన్), జి.జీవన్ కుమార్ (అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్), కె.శ్రీకాంత్ రెడ్డి(అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్), పి.రామచంద్రరావు (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), వి.శ్రీనివాస్ (అసిస్టెంట్ డైరెక్టక్ ఆఫ్ హార్టికల్చర్), డీవీ ఫణికుమార్ (సూపరింటెండెంట్), కె.ప్రజ్ఞ( అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), వి.సతీశ్ (అసిస్టెంట్ ఇంజినీర్), ఎం.వెంకటదాస్ రెడ్డి (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-హౌసింగ్), డి.విశ్వం కుమార్ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), కె.సాయినాథ్ (ట్యాక్స్ ఇన్స్పెక్టర్),జి.కళ్యాణ్ యాదవ్ (సీనియర్ అసిస్టెంట్), ఎం.యూసుఫ్ పాషా (సర్కిల్ మేనేజర్), పి.ప్రవీణ్ (అసిస్టెంట్ ఇంజినీర్), శ్రీకాంత్ (కమ్యూనిటీ కో ఆర్డినేటర్), సి.నారాయణ స్వామి (సినియర్ అసిస్టెంట్), సీ.ఎస్.మారుతి రావు (అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్) ఉన్నారు.
వార్డు కార్యాలయాల ద్వారా సేవలు వేగవంతం; హోంమంత్రి మహమూద్ అలీ
వార్డు కార్యాలయాల ద్వారా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు, సమర్ధవంతమైన పరిపాలన సౌలభ్యానికి దోహదపడుతాయని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం ఆజంపురా వార్డు కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ గ్రేటర్ ప్రజలకు సుపరిపాలను అందించేందుకే వార్డు కార్యాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. వార్డు కార్యాలయాల్లో రోడ్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, ఎంటమాలజీ తదితర విభాగాలకు చెందిన అధికారులు ఇక్కడి నుంచి పని చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లాయక్ అలీ, ఎంఐఎం నాయకలు అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల కోసం..ప్రజల వద్దకే ;ప్రభుత్వ సేవలన్నీ వార్డు కార్యాలయాల ద్వారానే మేయర్ గద్వాల విజయలక్ష్మి
పౌరసేవల కోసం సుదూరాలకు వెళ్లే అక్కర లేదు, ఇక నుంచి ప్రభుత్వ సేవలన్నీ వార్డు కార్యాలయాల ద్వారానే పొందాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ డివిజన్ జానకి ఎన్క్లేవ్లో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వార్డు కార్యాలయాల్లో ప్రభుత్వంలోని 10 విభాగాలకు చెందిన అధికారులు నిత్యం విధుల్లో ఉంటారన్నారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు వీరు నిర్ణీత సమయంలో పరిష్కారం చూపుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, ఉపకమిషనర్ సురేందర్రెడ్డి, డిప్యూటీ ఇంజినీర్లు వెంకటేశ్వర్, కనకయ్య, డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
ప్రజల వద్దకే పాలన
పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ప్రజా సమస్యలకు వెంటనే పరిష్కారం చూపడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటి సారిగా వార్డు పాలనకు శ్రీకారం చుట్టుంది. ప్రధాన కార్యాలయం, జోన్, సర్కిల్ కార్యాలయాలతో పాటు వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం ఆయా వార్డు కార్యాలయాలను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. 40వేల జనాభాకు ఒక వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా.. ఒక్కో కార్యాలయంలో ఆయా విభాగాలకు చెందిన మొత్తం 10 మంది అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలకు సత్వర పరిష్కారం చూపనున్నారు.
పౌర సేవలు ప్రజలకు ఎంత చేరువలో ఉంటే.. అంత సమర్థవంతంగా పాలన సాగుతుంది. దాదాపు కోటికి మించి జనాభా ఉన్న జీహెచ్ఎంసీలో కేవలం 30 సర్కిల్ కార్యాలయాల ద్వారా మాత్రమే ప్రస్తుతం సేవలు అందుతున్నాయి. అందుకే.. ప్రజల కోసం ప్రజల వద్దకే ఆ సేవలన్నీ చేరాలనే సదుద్దేశంతో ఈ రోజు (జూన్ 16) నుంచి 150 వార్డుల్లో పౌర సేవలు అమలు చేస్తున్నాం. ఒక్కో వార్డు ఆఫీసులో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలో 10 మంది అధికారులు స్థానికంగా అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా సర్కిల్ కార్యాలయం వరకు వెళ్లే అవసరం లేకుండా వార్డు కార్యాలయాల్లోనే పరిష్కారం చూపుతారు. సిటిజన్ చార్ట్ ప్రకారం నిర్ణీత వ్యవధిలోనే పౌర సేవలు అందేలా.. అంతే వేగంగా ఫిర్యాదులకు పరిష్కారం చూపేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఫిర్యాదులు సోషల్ మీడియాలో వచ్చినా సరే స్వీకరించండి. దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్న ఈ వ్యవస్థను విజయవంతం చేసి హైదరాబాద్ను ఓ రోల్మోడల్గా నిలుపుదాం.
– మంత్రి కేటీఆర్