హైదరాబాద్/ఖైరతాబాద్, సెప్టెంబర్28 (నమస్తే తెలంగాణ): వృద్ధాప్యం శరీరానికి సంబంధించిందే తప్ప మనసుకు కాదని, మనిషి బతికినంత కాలం సమాజ శ్రేయస్సు, కుటుంబ సంక్షేమానికి పాటుపడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అక్టోబర్1 సీనియర్స్ సిటిజన్స్ డేను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన వాకథాన్ను నెక్లెస్ రోడ్డులో మంత్రి బుధవారం ప్రారంభించారు. సీనియర్ సిటిజన్స్తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఒక డాక్టర్ను ఏర్పాటు చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ర్యాలీలో హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే మోహన్రెడ్డి, సీనియర్ సిటిజన్స్ నాగేశ్వర్రావు, పార్థసారథి. వికలాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ, దక్షిణామూర్తి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
57 ఏండ్లకే పెన్షన్.. సీఎంకు సీనియర్ల కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పథకం కింద 57 ఏండ్లు నిండిన ప్రతి ఒకరికీ రూ.2016 పెన్షన్ అందిస్తుండటంపై సీనియర్ సిటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల్లో భాగంగా హోటల్ హరిత ప్లాజాలో బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి కొప్పుల మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి ప్రతి జిల్లా కేంద్రంలో అన్ని వసతులతో ఓల్డేజ్ హోం, డేకేర్ సెంటర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ఇప్పటికే వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. సమావేశంలో దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, అడిషనల్ ఐజీ నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయ్కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్య దేవరాజన్. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి , మాజీ ఎమ్మెల్యే మోహన్రెడ్డి, సీనియర్ సిటిజన్స్ పార్థసారథి, నర్సింగ్ రావు, నాగేశ్వరరావు సహా పలువురు పాల్గొన్నారు.